లిక్కర్ వ్యాపారం జొలికెళ్లొద్దు.. చంద్రబాబు సూచన

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన తర్వాత మరిన్ని పథకాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే విధంగా ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చంద్రబాబు ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలోనే దీపావళి తర్వాత సూపర్ సిక్స్ నుండి మరిన్ని పథకాలను అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యచరణపై వారికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు టీడీపీ సభ్యత్వ నమోదు, పంచాయతీరాజ్ వ్యవస్థలు, సూపర్ సిక్స్ పథకాలు, పల్లె పండుగ వంటి 8 అంశాలపై వారితో చంద్రబాబు విపులంగా చర్చించారు. ఐదేళ్లలో జగన్ వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశాడని, ఏ వ్యవస్థ సజావుగా పని చేసే పరిస్థితి లేదని చంద్రబాబు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా జగన్ దారి మళ్ళించాడని, మునుపెన్నడు ఇటువంటి పరిస్థితులను చూడలేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జగన్ హయాంలో జరిగిన ప్రతి అరాచకం వెనుక గంజాయి బ్యాచ్ వంటి అసాంఘిక శక్తి ఉందని ఆరోపించారు.

తమ పాలనలో తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. 7 అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేశామని, ఇసుక, మద్యంపై నూతన పాలసీలు తెచ్చామని చెప్పారు. ఇక, ఇసుక, లిక్కర్ వ్యాపారాలతో సహా మిగతా వ్యాపారాలలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, టిడిపి నేతలు ఎవరు జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు కుటుంబం చాలా ఏళ్లుగా లిక్కర్ వ్యాపారంలో ఉందని, వారసత్వంగా ఆ వ్యాపారం చేసే వారు కొనసాగించవచ్చని, కానీ కొత్తగా ఆ వ్యాపారం లోకి వెళ్లి డబ్బులు సంపాదించాలన్న ఆలోచన సరికాదని అన్నారు.

పార్టీలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉండాలని, కార్యకర్త తప్పు చేసినా ముఖ్యమంత్రిపై ప్రభావం పడే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని, దానివల్ల పార్టీ నష్టపోతుందని అన్నారు. డబ్బులతోనే ఎన్నికలు జరగవని, మనపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారని చంద్రబాబు గుర్తు చేశారు. మోడీ పాలన పై నమ్మకం, పవన్ కళ్యాణ్ పై విశ్వాసం, నా అనుభవం చూసి ప్రజలు ఓటేశారని చంద్రబాబు అన్నారు. కూటమిలో మిగతా భాగస్వామి పార్టీలను కలుపుకొని సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.

గత ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులపై కేసులు పెట్టి వేధించారని, అలాగే మనమూ చేస్తే రాష్టం రావణ కాష్టం అవుతుందని అన్నారు. టీడీపీ నేతల ప్రవర్తనపైనే రాబోయే ఎన్నికల్లో మెజారిటీ ఆధారపడి ఉంటుందన్నారు. అధికారం కోసం కాకుండా ప్రజల కోసం, దేశం కోసం పాటుబడిన పార్టీ టీడీపీ అని అన్నారు. పదవులు తీసుకోకుండానే వాజ్ పేయి ప్రభుత్వంలో పనిచేశామని, తాజాగా ఎన్డీఏతో పొత్తు కూడా డిమాండ్లు లేకుండానే పెట్టుకున్నామని చెప్పారు.