బోరుగడ్డ అనిల్ అరెస్టు.. కంప్లైంట్ ఎప్పటిదంటే?

వైసీపీ అధినేత.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అమితంగా ఆరాధిస్తూ.. ఆయన రాజకీయ వ్యతిరేకుల్ని వ్యక్తిగత శత్రువులుగా భావించే కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు బోరుగడ్డ అనిల్ కుమార్. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం.. తాను టార్గెట్ చేసిన వారి స్థాయిని వదిలేసి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తత్త్వం ఉన్న బోరుగడ్డ అనిల్ ను తాజాగా గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు.ఆసక్తికరమైన అంశం ఏమంటే.. 2021లో ఆయనపై చేసిన ఫిర్యాదు అంశంలో తాజాగా అరెస్టు కావటం.

ఏపీ గత ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు నారా లోకేశ్ మొదలు కొని ఎవరినైనా సరే.. ఎంత మాట అయినా సరే నోటికి వచ్చినట్లుగా మాట్లాడేసే విషయంలో అతనికి మించినోళ్లు ఉండరన్న పేరుంది. పలు కేసులు.. పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న అతడిపై ఎన్ని విమర్శలు వచ్చినా చర్యలు తీసుకున్నది లేదు.

అయితే.. ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడై.. చారిత్రక తీర్పును ఓటర్లు ఇచ్చారో.. ఆ తర్వాత నుంచి అతను కనిపించకుండా పోయాడు. వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయిన అనిల్ కుమార్ అండర్ గ్రౌండ్ లో ఉండిపోయాడు. అయితే.. రెండు రోజుల క్రితం గుంటూరుకు వచ్చినట్లుగా తెలుసుకున్న సీసీఎస్ పోలీసులు..అతడ్నిఅరెస్టు చేశారు. గతంలో అతడిపై భూవివాదాలతో పాటు మహిళల వేధింపులపైనా పలు కేసులు ఉన్నాయి.

సోషల్ మీడియాలోనూ.. టీవీ చర్చల్లోనూ నోరు పారేసుకునే అలవాటున్న బోరుగడ్డ అనిల్.. ఏపీలో అధికారమార్పిడి జరిగిన తర్వాత నుంచి కామ్ గా ఉంటున్నారు. అయితే.. గతంలో అతను చేసిన తప్పులు.. దందాలు అతడ్ని కేసుల రూపంలో వెంటాడుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ మహిళలని ఇష్టారాజ్యంగా అనే అలవాటున్న అనిల్ కుమార 2021లో కర్లపూడి బాబు ప్రకాష్ ను రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

తాను చెప్పినట్లుగా డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో.. అతదిపై కంప్లైంట్ చేశాడు బాధితుడు. ఈ కేసుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా అతడ్ని గుంటూరులో పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ప్రస్తుతం నల్లపాటు పోలీస స్టేషన్ లో రహస్యంగా విచారిస్తున్నట్లు చెబుతున్నారు.