రెడ్డి గారి కూతురు… రాకెట్ స్పీడ్

రెడ్డిగారి కూతురా.. మ‌జాకా? అన్న‌ట్టుగా రెచ్చిపోయారు.. మాజీ ఎంపీ, నంద్యాల‌కు చెందిన ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజ‌ల‌. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌గా ఎదిగిన ఎస్పీవై రెడ్డి రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు.. గ‌త రెండు ద‌శాబ్దాలుగా సుజ‌లే చ‌క్రం తిప్పారు. ఆయ‌న ఎంపీగా ఉన్న‌ప్పుడు.. నంద్యాల స‌హా ఢిల్లీలోనూ సుజ‌ల దూకుడు చూపించారు. ఇక‌, ఎస్పీవై రెడ్డి మ‌ర‌ణానంత‌రం రాజ‌కీయాల్లోకి రావాల‌ని ప్ర‌య‌త్నించి.. ప‌లు కార‌ణాల‌తో ఆమె వెనుక‌డుగు వేశారు.

అయితే.. ఇప్పుడు అనూహ్యంగా సుజ‌ల పేరు తెర‌మీదికి వ‌చ్చింది. ఆమె గురించి రాయ‌ల సీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం.. తాజాగా జ‌రిగిన మ‌ద్యం దుకాణాల లాట‌రీ ప్ర‌క్రియే. ఈ ప్ర‌క్రియ‌లో స‌హ‌జంగానే ఒక పారిశ్రామిక వేత్త‌గా సుజ‌ల పాల్గొన్నారు. దీనిలో త‌ప్పులేదు. ఎస్పీవై రెడ్డి వార‌స‌త్వాన్ని నిలబెట్టాల‌ని భావించిన ఏకైక కుమార్తెగా ఆమె రంగంలోకి దిగారు. అయితే.. చిత్రం ఏంటంటే.. జిల్లాకో పార్టీతో ఆమె చేతులు క‌లిపారట‌.

మొత్తంగా 4 జిల్లాల్లోనూ సుజ‌ల షాపులు ద‌క్కించుకున్నారు. అనంత‌పురం , క‌ర్నూలు, అన్న‌మ‌య్య‌, క‌డ‌పలో నూ విరివిగా సుజల షాపులు ద‌క్కించుకోవ‌డం సీనియ‌ర్ వ్యాపారుల‌ను కూడా విస్మ‌యానికి గురిచేస్తోంది. అంతేకాదు.. ఇన్ని జిల్లాల్లోనూ షాపులు ద‌క్కించుకునేందుకు సుజ‌ల అన్ని పార్టీల వారినీ మ‌చ్చిక చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. అనంత‌పురం జిల్లాలో చాలా మంది టీడీపీ నాయ‌కుల‌కే దుకాణాలు ద‌క్క‌లేదు. కానీ, ఇక్క‌డ కూడా సుజ‌ల 4 దుకాణాలు ద‌క్కించుకున్నారు.

క‌డ‌ప‌లో 2 దుకాణాలు సొంతం చేసుకున్నారు. అన్న‌మయ్య జిల్లాలో 9 దుకాణాలు, నంద్యాల‌లో 3 దుకాణాలు.. ఇలా లెక్కకు మిక్కిలిగా సుజ‌ల దుకాణాలు ద‌క్కించుకోవ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆమె పేరు మార్మోగుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఎస్పీవై రెడ్డి నంది పైపుల వ్యాపారానికే ప‌రిమితం అయితే.. ఆయన‌ వార‌సురాలిగా వ‌చ్చిన సుజ‌ల మాత్రం ఇందుగ‌లడందు లేద‌న్న‌ట్టుగా.. మ‌ద్యం వ్యాపారంలోనూ దూకుడుగా ముందుకు సాగ‌డం గ‌మ‌నార్హం.