అఖిల ప్రియ‌.. ఆగ‌ట్లేదుగా!!

భూమా అఖిల ప్రియ‌. ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని ఆళ్ల గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న మాజీ మంత్రి. ఆమె విజ‌యం ద‌క్కించుకున్న ఈ నాలుగు మాసాల్లో రెండు సార్లు చంద్ర‌బాబుకు ప‌నిక‌ల్పించారు. ఈ రెండు సార్లు కూడా చంద్ర‌బాబు ఆమెకు తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నాక‌.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె అధికారుల‌ను బెదిరించిన వీడియోలు జూలైలో వెలుగు చూశాయి. తాను చెప్పింది వినాల‌ని.. చెప్పిందే చేయాల‌ని.. రూల్స్ ఉంటే మీ ఇంట్లో పాటించాల‌ని ఆమె హెచ్చ‌రించారు.

దీంతో చంద్ర‌బాబు వ‌రకు విష‌యం వెళ్లింది. స్పందించిన ఆయ‌న ఆమెకు ఫోన్ చేసి క్లాసిచ్చారు. అంతేకాదు.. నీకు మంత్రి ప‌ద‌వి ఎందుకురాలేదో తెలుసుకోమ‌ని కూడా చుర‌క‌లు అంటించారు. దీంతో ఒక నెల రోజులు సైలెంట్‌గా ఉన్న అఖిల‌ప్రియారెడ్డి.. సెప్టెంబ‌రులో మ‌రోసారి నోరు జారారు. త‌న ద‌గ్గ‌ర కూడా రెడ్ బుక్ ఉంద‌ని.. దానిలో 100 మందికిపైగా పేర్లు ఉన్నాయ‌ని.. వారంద‌రినీ వ‌దిలి పెట్టేది లేద‌ని హెచ్చ‌రించారు. అంతేకాదు.. తాను మంచిదాన‌ని ఎవ‌రూ అనుకోవ‌ద్ద‌ని కూడా అన్నారు.

ఈ వ్యాఖ్య‌లు కూడా సీఎం చంద్ర‌బాబు వ‌ర‌కు చేర‌డం.. ఆ వెంట‌నే ఆయ‌న మ‌రోసారి క‌ల్పించుకుని వార్నింగ్ ఇవ్వ‌డం తెలిసిందే. దీంతో మ‌ళ్లీ నెల రోజులు మౌనంగా ఉన్న అఖిల ప్రియ తాజాగా సీనియ‌ర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్‌రెడ్డితో కయ్యానికి కాలు దువ్వారు. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన నామినేటేడ్ ప‌దవుల్లో మోహ‌న్‌రెడ్డికి చంద్ర‌బాబు విజ‌య డెయిరీ చైర్మ‌న్ ప‌ద‌విని ఇచ్చారు. తాజాగా క‌ర్నూలులోని డెయిరీ కార్యాల‌యానికి వెళ్లి భూమా.. ఆయ‌న సీట్లోనే కూర్చున్నారు.

నిజానికి చైర్మ‌న్ సీట్లో కూర్చుకోవ‌డం ప్ర‌ధాన త‌ప్పు. పైగా ఆయ‌న లేన‌ప్పుడు ఆఫీసులో కూర్చుని స‌మీక్ష‌లు చేయ‌డం ఇంకా త‌ప్పు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మోహ‌న్‌రెడ్డి స్పాట్‌లోనే ఫోన్ చేసి ప్ర‌శ్నించారు. అయితే.. మోహ‌న్‌రెడ్డిని ద‌బాయించిన అఖిల ప్రియ‌.. “నాకు మామగా ఫోన్ చేసినావా?విజయా డైరీ ఛైర్మన్‌గా చేసినావా? మామ కుర్చీలో కోడలిగా నేను కూర్చుంటే తప్పా?” అని ప్ర‌శ్నించారు. ఈ వ్య‌వ‌హారం.. వివాదానికి దారి తీసింది. దీంతో అఖిల ప్రియ ఆగ‌ట్లేదుగా! అనే కామెంట్లు టీడీపీలోనే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.