దేవర 500 కోట్లు.. ఆడియన్స్ లైట్

పెద్ద సినిమాలకు టాక్ ఎలా ఉన్నా.. వాస్తవ వసూళ్లు ఎలా ఉన్నా.. తొలి రోజు నుంచే ‘భారీ’ పోస్టర్లు రెడీ అయిపోతాయి. సినిమా నిజంగా ఎంత కలెక్ట్ చేసిందో అంత పోస్టర్ల మీద ప్రకటించే రోజులు ఎప్పుడో పోయాయి. కలెక్షన్లు పెంచి చూపించడం అన్నది ఒక కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. కొన్ని సినిమాలకు 10-20 శాతం వసూళ్లు పెంచి చూపిస్తూ.. కొన్ని చిత్రాలకు అది 30-40 శాతానికి కూడా పెరిగిపోతోంది. ఇటీవలే విడుదలైన ‘దేవర’ సినిమాకు అదనపు వసూళ్ల శాతం కొంచెం ఎక్కువే అని ప్రచారం జరిగింది. 

నిజానికి ఈ సినిమాలో ఉన్న కంటెంట్‌‌తో పోలిస్తే సినిమా బాగానే ఆడింది. ఫ్లాప్ అవుతుందనుకున్న సినిమా.. వీకెండ్లో మంచి వసూళ్లు సాధించి బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేసింది. వీకెండ్ తర్వాత కొంచెం వీక్ అయినా.. దసరా సెలవులు కలిసి వచ్చి బాగానే ఆడింది. కానీ వచ్చిన వసూళ్లతో పోలిస్తే పోస్టర్లలో వేసిన ఫిగర్స్ ఎక్కువ అని మాత్రం టాలీవుడ్లో చర్చ జరిగింది. 

ఐతే సోషల్ మీడియాలో ఈ డిస్కషన్లు జరుగుతున్న సమయంలోనే ‘దేవర’ను డిస్ట్రిబ్యూట్ చేసిన సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఓ కామెంట్ చేశాడు. ‘లక్కీ భాస్కర్’ ప్రమోషనల్ ఈవెంట్లో ఆయనకు ‘దేవర’ గురించి ఓ ప్రశ్న ఎదురైతే.. కలెక్షన్ల పోస్టర్లు కేవలం అభిమానుల కోసమే వేస్తామని.. అవి చూసి వాళ్లు హ్యాపీ అవ్వాలన్నది ఉద్దేశమని.. వాళ్లు ఆనందంగా ఉంటే తాము కూడా హ్యాపీ అని అన్నారు. 

పరోక్షంగా పోస్టర్లలో కలెక్షన్లు ఎక్కువ చేసి చూపిస్తామని ఆయన అంగీకరించేశారు. మరి ఆదాయపు పన్ను అధికారుల మాట ఏంటి అని అడిగితే.. ఆ పోస్టర్ల సంగతి వాళ్లకు కూడా తెలుసని అనేశారు. నాగవంశీ మాటలతో ‘దేవర’ కలెక్షన్ల పోస్టర్లు ఒరిజినల్ కాదనే అభిప్రాయం అందరిలో బలపడిపోయింది. తాజాగా ‘దేవర’ టీం 500 కోట్ల పోస్టర్ రిలీజ్ చేస్తే నెటిజన్లు చాలా లైట్ తీసుకుంటున్నారు. అభిమానులు కూడా అంతగా ఎగ్జైట్ కావట్లేదు. ఈ కలెక్షన్ల పోస్టర్లకు ఉన్న క్రెడిబిలిటీ ముందు నుంచే తక్కువ అంటే.. తాజా పరిణామాలతో వాటిని మరింత లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది.