మహేష్-రాజమౌళి.. ముహూర్తం కుదిరింది

సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా కోసం ఎన్నో ఏళ్ల నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘మగధీర’ కంటే ముందే వీరి కలయికలో సినిమా రావాల్సింది. కానీ రకరకాల కారణాల వల్ల అది సాధ్య పడలేదు. ఐతే ఆలస్యమైతే అయింది కానీ.. రాజమ ౌళి భారత నంబర్ వన్ దర్శకుడిగా, ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించిన సమయంలో మహేష్‌తో సినిమా చేయబోతుండటం అభిమానులకు ఒకింత ఆనందమే కలిగిస్తోంది.

వీరి సినిమా కోసం కేవలం భారతీయ ప్రేక్షకులే కాక వరల్డ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మామూలుగానే రాజమౌళి సినిమా అంటే కథ తయారీ, ప్రి ప్రొడక్షన్ పనులకు చాలా టైం పడుతుంది. మహేష్‌తో ఆయన చేసే సినిమా మీద అంచనాలు మరీ ఎక్కువగా ఉండడంతో మరింత టైం తీసుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజైన రెండున్నరేళ్లకు కూడా ఈ సినిమా మొదలు కాలేదు.

ఐతే ఎట్టకేలకు మహేష్-రాజమౌళి సినిమా చిత్రీకరణకు ముహూర్తం కుదిరింది. ఈ చిత్రం 2025 జనవరిలో సెట్స్ మీదికి వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. తాజాగా ఆయన ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా.. మహేష్-రాజమౌళి సినిమా గురించి అభిమానులు అడుగుతుంటే.. జనవరిలో చిత్రీకరణ మొదలువుతుందని చెప్పారు.

ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమా కోసం వర్క్ షాప్స్‌లో పాల్గొంటుండగా.. రాజమ ౌళి డమ్మీ షూట్స్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సెట్స్ నిర్మాణం జరుగుతోంది. ప్రి ప్రొడక్షన్ పనులు డిసెంబరు నెలకు పూర్తవుతాయట. జనవరిలో సినిమాను లాంఛనంగా మొదలుపెట్టి దాంతో పాటే రెగ్యులర్ షూటింగ్ కూడా ఆరంభిస్తారట. ఈ సినిమా కనీసం రెండేళ్ల పాటు చిత్రీకరణ దశలో ఉంటుందని అంచనా. 2027లో కానీ రిలీజ్ ఉండకపోవచ్చు.