వేట్టయాన్.. రజినీనే అడిగి మరీ

జై భీమ్ సినిమా చూసిన వాళ్లకు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వ శైలి మీద ఒక అంచనా వచ్చి ఉంటుంది. సామాజిక అంశాల నేపథ్యంలో చాలా ఇంటెన్స్‌గా ఆ సినిమా తీశాడు జ్ఞానవేల్.

ఇలాంటి సినిమాలో సూర్య లాంటి స్టార్ హీరో నటించడం.. హీరో ఎలివేషన్లకు దూరంగా ఒక కథలో ఆయన పాత్ర ఇమిడిపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఐతే సూర్య అప్పుడప్పుడూ ఇలాంటి ప్రయోగాలు చేస్తాడు కాబట్టి ప్రేక్షకులు మరీ షాకైపోలేదు.

ఐతే ఇలాంటి సినిమా తీసిన దర్శకుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ఓ చిత్రం చేయబోతున్నాడంటే షాకింగ్‌గానే అనిపించింది. రజినీ అంటే మాస్. ఆయన ఇమేజ్‌కు భిన్నంగా తీసిన కబాలి, కాలా లాంటి సినిమాలు బోల్తా కొట్టిన నేపథ్యంలో జ్ఞానవేల్ ఆయనతో ఎలాంటి చిత్రం తీస్తాడో అన్న సందేహాలు ఉన్నాయి. 

ఐతే జ్ఞానవేల్ తన శైలిలోనే కథ చెప్పినప్పటికీ.. రజినీ తన ఇమేజ్‌కు తగ్గట్లుగా దాన్ని మార్పించాడట. ఈ విషయాన్ని ‘వేట్టయాన్’ ఆడియో వేడుకలో రజినీనే స్వయంగా వెల్లడించాడు. ‘‘జ్ఞానవేల్ తీసిన జై భీమ్ నాకు బాగా నచ్చింది. కానీ గతంలో జ్ఞానవేల్‌తో నాకు మాట్లాడే అవకాశం ఎప్పుడూ రాలేదు. నా కూతురు సౌందర్య నా దగ్గరికి వచ్చి వేట్టయాన్ కథ వినమని చెప్పింది. విన్నాను. బాగుందనిపించింది. కానీ ఈ సినిమా తీయడానికి చాలా డబ్బు ఖర్చవుతుంది.

ఉన్నదున్నట్లుగా ఆ కథను తీసి కమర్షియల్‌గా వర్కవుట్ చేయడం కష్టం. అందుకే కథలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాలని చెప్పాను. పది రోజుల టైం అడిగాడు. కానీ కమర్షియల్‌గా మార్చినా నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనకరాజ్ లాంటి దర్శకుల సినిమాల్లాగా మార్చలేను అని చెప్పాడు. పది రోజుల తర్వాత కథలో మార్పులు చేసి తీసుకొచ్చాడు. అవి చూసి ఆశ్చర్యపోయాను’’ అని రజినీకాంత్ తెలిపాడు. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందరే సంగీత దర్శకుడిగా కావాలని దర్శకుడే పట్టుబట్టి తీసుకున్నట్లు రజినీ వెల్లడించాడు.