‘ఖడ్గం’లో శ్రీకాంత్‌ను వద్దన్నా..

రెండేళ్ల కిందటి నుంచి తెలుగులో రీ రిలీజ్‌ల హంగామా నడుస్తోంది. మధ్యలో కొంచెం జోరు తగ్గినట్లు అనిపించినా.. ఈ మధ్య మళ్లీ ఊపు కనిపిస్తోంది. ఆగస్టులో మహేష్ బాబు మూవీ ‘మురారి’, సెప్టెంబరులో పవన్ కళ్యాణ్ సినిమా ‘గబ్బర్ సింగ్’ మోత మోగించేశాయి. కొంచెం గ్యాప్ తర్వాత మరో రీ రిలీజ్ విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తోంది. అదేమీ పెద్ద స్టార్ హీరో సినిమా కాదు. అయినా క్రేజ్ బాగానే ఉంది. ఆ మూవీనే ‘ఖడ్గం’.

కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రమిది. తెలుగులో వచ్చిన దేశభక్తి చిత్రాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్‌గా దీన్ని చెప్పొచ్చు. రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ట్రెండీగా అనిపించే సినిమా ఇది. దీన్ని గత నెలలోనే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఈ నెల 18న రీ రిలీజ్‌కు ముహూర్తం కుదిరింది. ఇందుకోసం కృష్ణవంశీ దగ్గరుండి రీ ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారు.

అంతే కాక ‘ఖడ్గం’ రీ రిలీజ్‌ను పురస్కరించుకుని కృష్ణవంశీ, శ్రీకాంత్ తదితరులు కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఈ సందర్బంగా శ్రీకాంత్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఈ చిత్రంలో అసలు తాను నటించాల్సింది కాదన్నాడు. ప్రధాన పాత్రకు తాను వద్దంటూ నిర్మాత మధుమురళి చెప్పినట్లు తెలిపాడు. తన స్టానంలో ఇంకా పెద్ద స్టార్‌ను తీసుకోవాలన్నది ఆయన అభిప్రాయమని.. కానీ కృష్ణవంశీ మాత్రం ఆ పాత్రకు తనే పర్ఫెక్ట్ అని పట్టుబట్టి ఈ సినిమా చేయించినట్లు తెలిపాడు.

చాలామంది ఇప్పటికీ ‘ఖడ్గం’ లాంటి సినిమా చేయమని అడుగుతుంటారని.. కానీ ‘ఖడ్గం’ ఒక మాస్టర్ పీస్ అని.. ఇలాంటి సినిమాను రీక్రియేట్ చేయడం సాధ్యం కాదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ఎన్ని తరాలు మారినా దేశభక్తి చిత్రాల్లో ‘ఖడ్గం’ మిన్నగా ఉంటుందని.. టీవీల్లో ఎన్నిసార్లు చూసినా తాజాగా అనిపిస్తుందని.. ఇలాంటి సినిమా మళ్లీ రిలీజ్ అవుతుండడం చాలా ఆనందంగా ఉందని శ్రీకాంత్ చెప్పాడు.