సూర్య కంగువ….24 కనెక్షన్ ?

బాహుబలి రేంజులో కోలీవుడ్ స్థాయిని పెంచుతుందని అక్కడి యావత్ పరిశ్రమ ఆశలు పెట్టుకున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి ఆఖరికి నవంబర్ 14 లాక్ చేసుకున్నారు కానీ దానికైనా ఖచ్చితంగా కట్టుబడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇంత పెద్ద సినిమా వస్తున్నా వరుణ్ తేజ్ మట్కా లాంటివి పోటీకి సిద్ధపడటం చూస్తుంటే సూర్య సినిమాని తక్కువంచనా వేస్తున్నారానే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా దసరా అయిపోగానే భారీ ఎత్తున ప్రమోషన్లకు స్టూడియో గ్రీన్, యువి సంస్థలు ప్లాన్ చేసుకుంటున్నాయి.

ఇదలా ఉంచితే కంగువలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి గతంలో వచ్చిన 24కి కనెక్షన్ ఉంటుందని చెన్నై టాక్. కథ పరంగా కాదు కానీ పాయింట్ విషయంలో సారూప్యత ఉంటుందట.

అంటే వందల సంవత్సరాల వెనుక ఉన్న ఒక అడవి యోధుడు వర్తమానంలోకి వచ్చి ఆధునిక టెక్నాలజీ వాడకంలో ఆరితేరిపోయిన ఒక గూఢచారిని కలుసుకుంటే ఎలా ఉంటుందనే అంశాన్ని దర్శకుడు సిరుతై శివ టచ్ చేశారని అంటున్నారు. 24లో చూపించిన టైం ట్రావెల్ ని కంగువలో ఇంకా విభిన్నంగా వాడుకుని ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా తెరకెక్కించారని అంటున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న కంగువలో దిశా పటాని హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ గా నటించారు. రజనీకాంత్ వేట్టయన్ కోసం అక్టోబర్ 10ని వదులుకున్నారని తొలుత ప్రచారం జరిగింది కానీ వాస్తవానికి పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా బాలన్స్ ఉండటం వల్లే కంగువ బృందం నవంబర్ కి షిఫ్ట్ అయ్యిందని చెన్నై టాక్.

ఈటి తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న సూర్య తన అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారని తెలిసినా క్వాలిటీ కోసం కంగువ ఎంత ఆలస్యమైనా భరిస్తూ వచ్చాడు. దేవర తరహాలోనే కంగువకు రెండో భాగం 2026 లేదా ఆ పై సంవత్సరం వచ్చేలా చూస్తున్నారట.