‘అమర్ అక్బర్ ఆంటోనీ’కి లాభాలా?

శ్రీను వైట్ల కెరీర్‌కు పెద్ద బ్రేక్ వేసిన సినిమా.. అమర్ అక్బర్ ఆంటోనీ. దాని కంటే ముందు ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ చిత్రాలతో డిజాస్టర్లు ఎదుర్కొన్నప్పటికీ.. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే వచ్చాడు వైట్ల. కానీ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా వాషౌట్ అయిపోవడంతో ఈ ప్రభావం వైట్ల మీద గట్టిగానే పడింది.

మళ్లీ ఇంకో సినిమా తీసి రిలీజ్ చేయడానికి ఆరేళ్ల సమయం పట్టేసింది. ఇప్పుడాయన గోపీచంద్ హీరోగా ‘విశ్వం’ మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో వైట్ల ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఫెయిల్యూర్ గురించి మాట్లాడాడు. ఈ సినిమా నిర్మాతలకు లాభాలు అందించినట్లు వైట్ల చెప్పడం విశేషం. ఆ సినిమా తాలూకు ప్రతికూల ప్రభావం మొత్తం తనే ఎదుర్కొన్నట్లు అతనన్నాడు.

‘‘నా సినిమాలు ఒకేలా ఉంటున్నాయని ప్రేక్షకులు మొనాటనీ ఫీలవుతున్న సమయంలో డిఫరెంట్‌గా చేద్దామనుకున్నా. ఒక కన్ఫ్యూజన్లో ఆ సినిమా చేశాను. కొత్తగా ఏదో ట్రై చేశాను. తక్కువ బడ్జెట్లో ఆ సినిమా పూర్తి చేశాను. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. కానీ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ద్వారా నిర్మాతలకు లాభాలు వచ్చాయి.

ఆ సినిమా ఫెయిల్యూర్ ప్రభావం మాత్రం నా మీద పడింది. కేవలం నిర్మాతలను రక్షించడం కోసమే సినిమా తీయకూడదని.. ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని కథ విషయంలో రాజీ పడకుండా సినిమా చేయాలని అప్పుడు నాకర్థమైంది. ఆ తర్వాత అన్నీ చూసుకుని ‘విశ్వం’ చేశాను’’ అని వైట్ల తెలిపాడు.

ఐతే ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో నిర్మాతలకు లాభాలు వచ్చాయని వైట్ల చెబుతున్న మాటల్లో ఎంత వరకు నిజముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చిత్రాన్ని అప్పట్లో రూ.40 కోట్ల బడ్జెట్లో మైత్రీ మూవీ మేకర్స్ తీసినట్లు వార్తలొచ్చాయి. సినిమాకు సరిగా బిజినెస్ జరగలేదు. పైగా తొలి రోజే థియేటర్లు వెలవెలబోయాయి. మరి ప్రొడ్యూసర్లకు ఎలా లాభాలు వచ్చాయో?