ఆ దర్శకుడిపై మోయలేని భారం

అయాన్ ముఖర్జీ.. ‘వేకప్ సిద్’ అనే క్లాస్ మూవీతో పరిచయమైన బాలీవుడ్ దర్శకుడు. ఈ చిత్రం ఓ మోస్తరు ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆ చిత్ర కథానాయకుడు రణబీర్ కపూర్‌నే పెట్టి ‘యే జవానీ హై దివానీ’ తీస్తే అది బ్లాక్ బస్టర్ అయింది. తనపై అంచనాలు పెరిగాయి. ఐతే అతడి తొలి రెండు చిత్రాలు క్లాస్‌గా సాగుతాయి. సింపుల్ నరేషన్‌తో అతను ఆకట్టుకున్నాడు.

ఐతే అలాంటి దర్శకుడి చేతికి ‘బ్రహ్మాస్త్ర’ లాంటి భారీ చిత్రాన్ని అప్పగించడం ఆశ్చర్యం కలిగించే విషయం. భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ ఈ చిత్రాన్ని సరిగా డీల్ చేయడంలో అయాన్ కొంత తడబడ్డాడు. ఈ సినిమా ఉన్నంతలో బాగా ఆడింది కానీ.. నిర్మాతలు పెట్టిన భారీ పెట్టుబడిని వెనక్కి తీసుకురాలేకపోయింది. ఈ తరహా చిత్రాలను డీల్ చేయాలంటే రాజమౌళే కరెక్ట్ అనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఐతే అయాన్ ‘బ్రహ్మాస్త్ర’తో ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా తనకు వరుసగా భారీ చిత్రాలే వస్తున్నాయి. బ్లాక్ బస్టర్ మూవీ ‘వార్’కు సీక్వెల్ తీసే బాధ్యతను సిద్దార్థ్ ఆనంద్‌ను కాదని.. అయాన్‌కు అప్పగించింది యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మధ్య దశలో ఉండగా.. ఇంకో భారీ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని అయాన్‌కే అప్పగించిందట యశ్ రాజ్ సంస్థ. ఆ సంస్థకు తలమానికమైన ‘ధూమ్’ సిరీస్‌లో నాలుగో చిత్రాన్ని అయానే డైరెక్ట్ చేయబోతున్నాడట. ‘ధూమ్-4’ గురించి ఎప్పట్నంచో చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు ఆ సినిమాను రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తీయాలని యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్ణయించింది.

ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ‘వార్-2’ను అయాన్ తీస్తున్న తీరు నచ్చి ‘ధూమ్-4’ బాధ్యతలు కూడా తనకే అప్పగించారట. కానీ ‘బ్రహ్మాస్త్ర’తో యావరేజ్ మార్కులు వేయించుకున్న అయాన్.. ‘వార్-2’తో ఎలాంటి ఫలితం రాబడతాడో తెలియదు. ‘వార్-2’నే పెద్ద భారం అంటే.. ఇప్పుడు ఇంకో పెద్ద బాధ్యతను తన మీద పెట్టేస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.