శంకర్‌కు నష్టం.. నిర్మాతకు లాభం

ఇప్పుడు కరోనా ఊసే లేదు. జనం థియేటర్లకు రాని పరిస్థితులు లేవు. ఇలాంటి టైంలో కమల్ హాసన్, శంకర్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన వందల కోట్ల సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం అంటే నమ్మశక్యం కాని విషయమే. కానీ అనూహ్య పరిణామాల మధ్య ‘ఇండియన్-3’ నేరుగా ఓటీటీలోకి రాబోతున్న విషయం బయటికి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ వచ్చే జనవరిలో ఈ చిత్రాన్ని నేరుగా స్ట్రీమ్ చేయబోతోంది.

నిన్న ఈ న్యూస్ బ్రేక్ అయిన దగ్గర్నుంచి శంకర్, కమల్‌ల అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా ఎలా నిర్ణయం తీసుకున్నారు అని మథన పడుతున్నారు. కానీ అన్నీ ఆలోచించాకే ‘ఇండియన్-3’ నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కమల్, శంకర్‌ కూడా ఆమోద ముద్ర వేశాకే ఓటీటీకి వెళ్లాలని డిసైడైనట్లు సమాచారం.

‘ఇండియన్-3’ ఎలా రిలీజైనా కమల్ హాసన్‌కు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. ఇండియన్-2 ఫలితం ఆయనపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు భారీ నష్టం వాటిల్లింది. శంకర్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఇండియన్-3ని ఓటీటీలో రిలీజ్ చేయడం ఆయనకు ఇబ్బందికరమే. కానీ ఆయన వల్ల నిర్మాతలు ఇప్పటికే చాలా అన్యాయం అయ్యారు.

‘ఇండియన్-2’ను అంత దారుణమైన ఫలితం అందుకున్నాక ‘ఇండియన్-3’ థియేటర్లలోకి వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదు. పార్ట్-2తో పోలిస్తే ఇది బెటర్ అనే ఫీలింగ్ ట్రైలర్ చూసినపుడు అనిపించినా.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే సాహసం చేయకపోవచ్చు. సినిమా ఎలా ఉన్నా థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం నామమాత్రంగానే ఉంటుంది. అలాంటపుడు ఓటీటీకి ఇస్తే నిర్మాతకు ఆదాయం పెరుగుుతంది. దాని వల్ల నష్టాలను కొంత భర్తీ చేసుకోవచ్చు. ఓటీటీలో కాబట్టి జనం బాగానే చూస్తారు. పార్ట్-2 చూసిన వాళ్లు.. ఈ కథ ఎలా ముగుస్తుందో చూద్దామని అయినా పార్ట్-3 చూస్తారు. కాబట్టి వ్యూయర్ షిప్‌కు ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇండియన్-3ని ఓటీటీలో రిలీజ్ చేయడం మంచి నిర్ణయంగానే భావించాలి.