దేవర దాచిపెట్టిన రహస్యాల చిట్టా

రెండు రోజులకే 243 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన దేవర వీరవిహారం కొనసాగుతోంది. భారీ టికెట్ రేట్లతోనూ జనాన్ని థియేటర్లకు రప్పిస్తూ హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడిస్తోంది. దేవర 2 ఎప్పుడనే స్పష్టత ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ మొదటి భాగంలో ఉన్న ఎన్నో రహస్యాలు అభిమానుల మధ్య చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా సినిమా ప్రారంభంలో దయా, యతి అనే ఇద్దరి గురించి పోలీస్ గా నటించిన అజయ్ ఎంక్వయిరీ చేయడం కనిపిస్తుంది. దేవర కథ వినిపించిన ప్రకాష్ రాజ్ వాళ్ళ ఊసు తప్ప అన్ని చెబుతాడు. సముద్రంలో అన్ని ఆస్థి పంజరాలు ఎవరివనే సస్పెన్స్ ఇంకా రివీల్ చేయలేదు.

ఇంటర్వెల్ లో తన మీదకు దాడికొచ్చిన అందరిని దేవర నరికి చంపాక ఆ శవాలను తర్వాత ఊరి వాళ్ళు చూస్తారు. సో లాజిక్ ప్రకారం దహనం అయిపోయి ఉంటుంది. మరి అట్టడుగు భాగంలో ఉండే డెడ్ బాడీస్ వాళ్ళవి కాదనే క్లారిటీ వచ్చేసింది. దేవర కొడుకు వరని పిరికివాడిగా చూపించారు. తండ్రి మరణం వెనుక ఉన్న గుట్టుని తెలుసుకోవడానికి అతనేం చేశాడనే క్లూ సైతం దర్శకుడు కొరటాల శివ ఇవ్వలేదు. భైర కొడుకు, దేవర చెల్లెలు, శ్రీకాంత్ బ్యాక్ గ్రౌండ్, షైన్ టామ్ చాకోకు గాయం ఇలా ఎన్నో అంశాలు, కొన్ని కీలక పాత్రలు టచ్ చేసి వదిలారు తప్పింది లోటుగా వెళ్ళలేదు. ఇవన్నీ పార్ట్ 2లో ప్రాధాన్యం సంతరించుకుంటాయి.

ఇక తంగంగా చేసిన జాన్వీ కపూర్ కు సైతం స్కోప్ దొరకలేదు. రెండో భాగంగా తనను ఎక్కువ చూస్తారని చెప్పారు. రెండు పేజీల డైలాగు ఆమె చెప్పడం చూసి షాకయ్యానని తారక్ ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. దేవర 1లో ఆ సన్నివేశం లేదు. ఇక బాబీ డియోల్ మీద కొంత భాగం తీశారని గతంలో లీక్ వచ్చింది. సో దయా, యతిలో ఒకరు ఖచ్చితంగా ఇతనే అయ్యుంటాడు. ఇక దేవర మరణం వెనుక మిస్టరీని ఛేదించాలి. ఈ లెక్కన చూస్తుంటే బాహుబలి 2 లాగే కొరటాల శివ చిక్కుముడులని ఏర్పరిచి వాటికి సమాధానాలు దేవర 2లో చెప్పబోతున్నాడు. టైం ఎంత పడుతుందనేది చెప్పలేదు కానీ ఎదురుచూపులు తప్పవు.