కొరటాలపై సోషల్ మీడియా విజయం

రెండు తెలుగు రాష్ట్రాలను గత కొన్ని వారాలుగా వైరల్ ఫీవర్లు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. సగటున ఇంటికొకరు జ్వరం బారిన పడ్డారు. ఐతే ఇప్పుడు ఇంకో కొత్త జ్వరం తెలుగు రాష్ట్రాలను పట్టుకుంది. కొత్త జ్వరమా.. వామ్మో అని కంగారు పడకండి. అదేమంత ప్రమాదకరం కాదు. ఆ జ్వరం పేరు.. దేవర. అవును.. గత కొన్ని రోజుల నుంచి దేవర ఫీవర్ రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. ఇప్పుడది పీక్స్‌కు చేరుకుంది.

గురువారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా స్పెషల్ షోలు పడిపోయాయి. దీంతో సోషల్ మీడియా దేవర జపంతో ఊగిపోతూ ఉంది. సినిమాకు టాక్ మిక్స్డ్‌గా ఉన్నప్పటికీ.. దేవరను ఎవ్వరూ విస్మరించలేని పరిస్థితి నెలకొంది. పాజిటివ్ లేదా నెగెటివ్.. ఎలా అయినా సరే అందరూ ‘దేవర’ గురించి మాట్లాడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. దర్శకుడు కొరటాల శివ సోషల్ మీడియాను గెలవలేకపోయారని.. వాళ్ల అంచనాలకు భిన్నంగా సినిమా లేదనే చర్చ నడుస్తోందిప్పుడు. ‘దేవర’ ట్రైలర్ రిలీజవ్వగానే దాని కథేంటో చాలామంది నెటిజన్లు అంచనా వేసేశారు. వర పాత్రలో షేడ్స్ గమనించి.. ఈ క్యారెక్టర్లో ట్విస్ట్ ఉంటుందంటూ కథలో కీలక మలుపును అంచనా వేసేశారు. యూట్యూబ్ ఛానెళ్లలో దీని మీద చాలా స్టోరీస్ వచ్చాయి.

ఇంత ఈజీగా కథను అంచనా వేసేస్తున్నారు.. ట్విస్టుల గురించి చెప్పేస్తున్నారు ఏంటి.. కొరటాల ఆలోచన అలా ఉండదులే.. ఆయన వీళ్ల అంచనాలకు భిన్నంగా ఏదైనా చేసి ఉంటాడు.. థియేటర్లలో సర్ప్రైజ్ చేస్తాడులే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ తీరా చూస్తే ట్రైలర్ రిలీజైనపుడు జరిగిన ప్రచారమే నిజమని తేలిపోయింది. వాళ్లు అంచనా వేసినట్లే ట్విస్ట్, క్లైమాక్స్ ఉండడంతో కొరటాల మీద సోషల్ మీడియానే గెలిచిందనే చర్చ నడుస్తోంది.