కాలిపోయిన సుదర్శన్ కటవుట్ కథేంటి

తెలుగు రాష్ట్రాల్లోనే ఐకానిక్ థియేటర్ గా పేరున్న సుదర్శన్ 35 ఎంఎంలో దేవర కటవుట్ హఠాత్తుగా మంటల్లో కాలిపోవడం అభిమానులను హతాశులను చేసింది. జూనియర్ ఎన్టీఆర్ నిలువెత్తు ప్రతిరూపం తగలబడిపోవడం చూసి జనం పరుగులు పెట్టగా ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి అగ్ని కీలలను చల్లార్చారు. ఇది సినిమా నచ్చక ఫ్యాన్స్ చేసిన పనని కొందరు అర్థం లేని ప్రచారాన్ని సోషల్ మీడియాలో లేవనెత్తగా అది కాస్తా వైరల్ కావడం మొదలయ్యింది. అసలది నిజం కాదు. షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పు రాజుకుందని, గుర్తించేలోగా పైదాకా వ్యాపించిందని ప్రాధమికంగా అందిన సమాచారం.

మరికొందరు చెబుతున్న వెర్షన్ ప్రకారం ఆకతాయిలు కావాలని చేశారని మాట్లాడుకున్నా అదంతా ఉత్తుత్తిదే. యాంటీ ఫ్యాన్స్ కొందరు ట్వీట్ల రూపంలో లేనిపోని అబద్దాలు ప్రచారంలోకి తేవడం లేనిపోని అనుమానాలకు తావిస్తోంది. టపాసులు పేల్చడం వల్ల పూలకు రవ్వలు అంటుకుని జరిగిందని మరికొందరు అంటున్నారు. నిజానిజాలు తర్వాత బయటికి వస్తాయి కానీ దేవరకు బ్యాడ్ టాక్ రావడంతో అలా చేశారనేది మాత్రం పెద్ద కామెడీ. ఎందుకంటే హెచ్చుతగ్గులు కొన్ని ఉన్నప్పటికీ సినిమా తీవ్రంగా నిరాశ పరచలేదన్నది వాస్తవం. సెకండాఫ్ ఇష్యూస్ ఉన్నాయి కానీ అవి మరీ డ్యామేజ్ అనిపించేంత కాదని ఫ్యాన్స్ అభిప్రాయం.

దశాబ్దాల చరిత్ర కలిగిన సుదర్శన్ లో ఇలా కటవుట్ మొత్తం కాలిపోవడం ఎప్పుడూ చూడలేదని చుట్టుపక్కల వాళ్ళు కామెంట్స్ చేసుకోవడం గమనార్షం. నిన్న రాత్రి తొమ్మిది గంటల నుంచే ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో భారీ ఎత్తున సెలబ్రేషన్లు జరుగుతున్నాయి. డీజేలు, లైటింగులు, బాణాసంచా, డెకరేషన్లు ఒకటా రెండా మాములు రచ్చ జరగడం లేదు. ఒంటి గంట స్పెషల్ షో టికెట్ ధర రెండు వేల రూపాయలకు పైగానే పలికిందంటేనే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీలైనంత త్వరగా కొత్త కటవుట్ పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం అదృష్టం