తెలివైన ఆలోచనతో మంచి నివాళి

ఇప్పుడున్న స్టార్ హీరోల పాత సినిమాల రీ రిలీజులంటే ప్రేక్షకులు ఎగబడతారు కానీ కాలం చేసిన లెజెండరీ క్లాసిక్స్ కి ఆ స్థాయి స్పందన కష్టం. కృష్ణ మోసగాళ్లకు మోసగాడు ఎంత మాస్టర్ పీస్ అయినా కొన్ని కేంద్రాల్లో మినహాయించి పెద్ద వసూళ్లు రాలేదు. ఇది దృష్టిలో ఉంచుకుని సింహాసనం విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. మాయాబజార్ కలర్ వెర్షన్ కావడం వల్ల రెస్పాన్స్ వచ్చేది. అందుకే అన్నపూర్ణ స్టూడియోస్ తెలివిగా వ్యవహరించడం వల్ల మంచి ఫలితం దక్కించుకుంది. ఇటీవలే ఏఎన్ఆర్ శత జయంతి సందర్భంగా ఫిలిం ఫెస్టివల్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

దేవదాసు, భార్యాభర్తలు, డాక్టర్ చక్రవర్తి లాంటి పది ఆల్ టైం హిట్స్ ని 4కె రీమాస్టర్ చేసి ఫిలిం హెరిటేజ్ అఫ్ ఇండియా సహాయంతో కొత్త ప్రింట్లతో ముప్పైకి పైగా నగరాల్లో ప్రత్యేక స్క్రీనింగ్స్ చేశారు. ఇది కాదు విశేషం. ఉచితంగా ఎవరు ముందు వస్తే వాళ్లకు ఫ్రీ టికెట్స్ తరహాలో కొన్ని సింగల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సుల్లో ప్రదర్శించడం జనాన్ని ఆకట్టుకుంది. ఎలాగూ ఫ్రీనే కదాని ప్రేక్షకులు భారీగా వచ్చారు. టికెట్లు అమ్మిన చోటా కనిపించారు. నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్, సుప్రియ, వెంకట్ దగ్గరుండి వీటి ఏర్పాట్లు చూసుకోవడంతో మీడియాలోనూ కవరేజ్ దక్కించింది.

ఇకపై ఇదే తరహా ప్లానింగ్ చేయాలని ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు అభిమానులు కోరుకుంటున్నారు. కొన్ని ఫ్రీ షోలు, మరికొన్ని పెయిడ్ షోలు వేయడం వల్ల రీచ్ ఎక్కువగా రావడంతో పాటు కొత్త జనరేషన్ కు ఆణిముత్యాల విలువ తెలుస్తుందని అంటున్నారు. నిజంగానే ఇలాంటివి అవసరమే. ఎన్టీఆర్ సెనెటరీకి స్పెషల్ కాయిన్స్, ఈవెంట్స్ చేశారు కానీ ఓల్డ్ క్లాసిక్స్ ప్రదర్శించలేదు. ఎంత యూట్యూబ్, ఓటిటిలు వచ్చి పాత సినిమాలు ఫ్రీగా దొరుకుతున్నా సరే పెద్ద తెరపై చూసే అనుభూతికి ఏదీ సాటిరాదు. అందుకే ఈ ట్రెండ్ ఇకపై కూడా కొనసాగాలనేదే మూవీ లవర్స్ కోరిక.