శత వసంతాల ‘అక్కినేని’ వైభవం

1981..ఎన్టీఆర్ తర్వాత ఆ స్థానంలో అగ్రహీరోగా వెలుగొందుతున్న ఏఎన్ఆర్ వెనుకబడ్డారు. కృష్ణ, శోభన్ బాబు లాంటి వాళ్ళు అప్పటికే దూసుకెళ్లిపోతుండగా చిరంజీవి లాంటి యువ రక్తాలు ఉనికిని చాటుకునేందుకు కష్టపడుతున్నాయి. అలాంటి సమయంలో నాగేశ్వరరావుగారి పనైపోయిందనే కామెంట్స్ వినిపించాయి. అప్పటికే నాలుగు దశాబ్దాల నట ప్రయాణం పూర్తి చేసుకున్న ఆయన దీన్ని పట్టించుకోలేదు. కట్ చేస్తే ఆ సంవత్సరం విడుదలైన ప్రేమాభిషేకం వందా రెండు వందలు కాదు ఏకంగా ఏడాది పాటు ఆడేసి కనక వర్షం కురిపించింది. ఏఎన్ఆర్ లెగసి చెక్కుచెదరలేదని ప్రపంచానికి నిరూపించింది.

    ఏఎన్ఆర్ వైభవం గురించి చెప్పేందుకు ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ఆయన ఏనాడూ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోవాలని చూడలేదు. ప్రేక్షకులు తనను ఎలా చూడాలనుకుంటున్నారో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ దానికి అనుగుణంగా నటించారు తప్పించి కృత్రిమ హీరోయిజం జోలికి వెళ్ళలేదు. పైన చెప్పిన బ్లాక్ బస్టర్ వచ్చిన తొమ్మిదేళ్లకే 1990లో విగ్గు లేకుండా అప్ కమింగ్ హీరోయిన్ మీనాకి తాతయ్యగా నటించి ఇంకో సిల్వర్ జూబ్లీ అందుకోవడం ఆయనకే చెల్లింది.ఆ తర్వాత కాలేజీ బుల్లోడులో డిస్కో శాంతిని ఆట పట్టిస్తూ నృత్యం చేయడం, మెకానిక్ అల్లుడులో చిరంజీవికి పోటీగా డాన్సు చేయడం కొన్ని మచ్చుతునకలు.

    ఏఎన్ఆర్ గురించి కొన్ని మాటల్లో ఎవరూ చెప్పలేరు. ధర్మపత్ని(1941)లో బాలనటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి సీతారామ జననం (1944) తో సోలో హీరోగా మారి తొలి విజయాన్ని కీలు గుర్రం (1949) రూపంలో అందుకున్నారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. దేవదాసు (1953) లో భగ్న ప్రేమికుడిగా ఆయన చూపించిన అజరామర నటన ముందు తాను చేసింది తక్కువేనని బాలీవుడ్ లెజెండరీ దిలీప్ కుమార్ ఒప్పుకోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎన్టీఆర్ ప్రభంజనం మొదలయ్యాక సోషల్ డ్రామాలతో మహిళల్లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకోవడం అక్కినేని ఘనత.

    విప్రనారాయణ లాంటి భక్తి చిత్రం, డాక్టర్ చక్రవర్తి లాంటి ఎమోషనల్ డ్రామా, తోడి కోడళ్ళు లాంటి ఫ్యామిలీ సెంటిమెంట్ ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆణిముత్యాలు తారసపడతాయి. ఇద్దరు మిత్రులు రూపంలో తెలుగు తెరకు తొలి ద్విపాత్రాభినయం పరిచయం చేసిన క్రెడిట్ అక్కినేనిదే. చెన్నై దాటి రానని మొండికేసిన టాలీవుడ్ ని హైదరాబాద్ కు వచ్చేలా చేయడంలో కొండల్లో కట్టిన అన్నపూర్ణ స్టూడియోస్ పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. రాజకీయాల్లోకి రమ్మని ఎన్టీఆర్ అంతటి వారే ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించి తన జీవితాన్ని పూర్తిగా సినిమాలకే అంకితం చేయడం ఒక అద్భుత ఘట్టం.

    చివరి శ్వాస వరకు నటించేందుకే తపించిన అక్కినేని నాగేశ్వరరావు గారు చివరి సినిమా మనంలో కొడుకు నాగార్జున, మనవళ్లు నాగచైతన్య, అఖిల్ తో కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఫ్యాన్స్ చిరకాలం చెప్పుకునే జ్ఞాపకం. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ తో పధ్నాలుగు మల్టీస్టారర్స్ లో నటించిన అరుదైన ఘనత ఏఎన్ఆర్ కు తప్ప ఇంకెవరికి సొంతం కాలేదు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు తెరను ప్రేమిస్తూనే ఉన్న ఏఎన్ఆర్ ఇంకో వంద సంవత్సరాల తర్వాతైనా సరే తన చెక్కుచెదరని సంతకాన్ని క్లాసిక్స్ రూపంలో భవిష్యత్తు తరాలకు అందిస్తూనే ఉంటారు. అందుకే అక్కినేని అంటే పేరు కాదు తెలుగువాడి భావోద్వేగం.