తమిళోళ్ళు పడిపోయారు.. ఇక మనోళ్ళే

బాలీవుడ్ హీరోయిన్లు దక్షిణాది సినిమాల్లో నటించిన సందర్భాల్లో ఆయా చిత్రాల ప్రమోషనల్ ఈవెంట్లకు వస్తే.. పొడి పొడిగా లోకల్ భాషలో రెండు ముక్కలు మాట్లాడడం చూస్తుంటాం. ఆ రెండు మూడు ముక్కలు మాట్లాడ్డమే గొప్ప అని ఫీలవుతుంటారు. దక్షిణాది మూలాలున్న వాళ్లు కూడా ఇక్కడి భాషలు మాట్లాడే ప్రయత్నం పెద్దగా చేయరు. కానీ తాను ఆ కోవకు చెందనని చాటుతోంది జాన్వి కపూర్.

తెలుగమ్మాయి అయిన శ్రీదేవి తనయురాలు అయిన జాన్వి.. తన మూలాలను మరిచిపోలేదని అనిపిస్తోంది. ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న జాన్వి.. ఈ చిత్రాన్ని తమిళంలో ప్రమోట్ చేయడానికి చెన్నైకి వెళ్ళింది. అక్కడ స్పష్టమైన తమిళంలో మాట్లాడి తమిళులను పడేసింది. తన ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లోనే మొదలుపెట్టినప్పటికీ.. ఎక్కువ గ్యాప్ లేకుండా తమిళంలోకి వెళ్లిపోయింది.

తమిళంలో మాట్లాడ్డం మొదలుపెట్టగానే ఏవో రెండు మూడు మాటలు బట్టీ కొట్టుకుని వచ్చి ఉంటుందని అనుకున్నారు విలేకరులు. కానీ ఆమె స్పష్టంగా తమిళంలోనే ఒక్కో వాక్యం పూర్తి చేస్తూ వెళ్లింది. తనకు చెన్నై ఎంత స్పెషలో ఆమె వివరించింది. చిన్నతనంలో తన తల్లితో ఉన్న మంచి జ్ఞాపకాలన్నీ చెన్నైతో ముడిపడినవే అని.. తనకిప్పుడు ఇంటికి తిరిగొచ్చినట్లు అనిపిస్తోందని.. ఆమెకు ఈ ప్రాంతం చాలా స్పెషల్ అని జాన్వి చెప్పుకొచ్చింది. తన తల్లిని ఇక్కడి వాళ్లు ఎంతో ఆదరించారని.. తనకు కూడా అలాంటి ప్రేమనే పంచాలని ఆమె కోరింది. చాలా వినమ్రంగా, ఏ తడబాటూ లేకుండా చక్కటి తమిళంలో జాన్వి మాట్లాడడంతో భాషాభిమానం ఎక్కువగా ఉండే తమిళ జనాలు ఫిదా అయిపోయారు.

శ్రీదేవి తెలుగమ్మాయే అయినా ఆమె చాలా ఏళ్లు చెన్నైలోనే ఉంది. అందుకే పిల్లలకు కూడా తమిళం నేర్పినట్లుంది. ఆమె తెలుగు కూడా ఆటోమేటిగ్గా బాగానే నేర్పి ఉంటుంది. కాబట్టి ‘దేవర’ తెలుగు వెర్షన్ ప్రి రిలీజ్ ఈవెంట్లో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడి ఇక్కడి వాళ్లను కూడా పడేయడం ఖాయమేమో.