ఉప్పెన భామకు మళ్ళీ నిరాశేనా

డెబ్యూతోనే సెన్సేషనల్ హిట్ అందుకుని ఆ తర్వాత వరస డిజాస్టర్లతో టాలీవుడ్ మార్కెట్ కోల్పోయిన హీరోయిన్ కృతి శెట్టి మలయాళం మూవీ ఏఆర్ఎం మీద గంపెడాశలు పెట్టుకుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మూడు తరాలు దొంగతనం చేసే హీరోని ట్రిపుల్ రోల్ లో చూపించిన ప్రయోగం ఆశించిన ఫలితం ఇస్తున్నట్టు కనిపించడం లేదు. సబ్జెక్టు పరంగా కొన్ని ప్రశంసలు దక్కినా అసలు కంటెంట్ ని నడిపించడంలో దర్శకుడు చూపించిన తడబాటు, సాగతీత ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావడంలో ఏఆర్ఎం విఫలమైందని వసూళ్లు చెబుతున్నాయి.

మళయాలంలో డీసెంట్ టాక్ ఉంది కానీ మరీ అద్భుతాలు సృష్టించే స్థాయిలో లేదనేది వాస్తవం. ఒకవేళ తెలుగులో ఇది హిట్ అయితే కెరీర్ మళ్ళీ ఊపందుకుంటుందనే ఆశతో ఉన్న కృతి శెట్టి అది నెరవేరేలా కనిపించడం లేదు. ఆ మధ్య శర్వానంద్ తో మనమే తిరిగి తనకు కంబ్యాక్ అవుతుందని బలంగా నమ్మింది. కానీ జరిగింది వేరు. అంచనాలు అందుకోవడంలో ఫెయిలవ్వడమే కాక కోర్టు వివాదం వల్ల కనీసం ఓటిటిలో వచ్చేందుకు కూడా అవకాశం లేక ఆగిపోయింది. ఒకటైంలో వరస ఆఫర్లు చూసి రష్మిక మందన్న, పూజా హెగ్డే లాగా దూసుకుపోతుందని అందరూ భావించారు. కానీ జరగలేదు.

ప్రస్తుతం కృతి శెట్టి విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తమిళంలో లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చేస్తోంది. లవ్ టుడేతో పేరు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాధన్ హీరో. ఎస్జె సూర్య ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. కార్తీతో వా వాతియర్, జయం రవి జీనీలు తనకు కీలకం కాబోతున్నాయి. ఈ మూడు సినిమాలు హిట్ అయితే కోలీవుడ్ లో సెటిలైపోవచ్చు. తెలుగులో మాత్రం ఆఫర్ల జాడ లేదు. అయినా ఏఆర్ఎంలో మొత్తం టోవినో థామస్ వన్ మ్యాన్ షో అయిపోయింది. అందుకే కృతి శెట్టికి ఎక్కువ స్కోప్ దక్కలేదు. బ్లాక్ బస్టర్ అయ్యుంటే కథ వేరుగా ఉండేది కానీ అది నెరవేరేది కూడా కష్టంగానే ఉంది.