కుదిరితే కప్పు కాఫీ…మళ్ళీ తాగాల్సిందే

రీ రిలీజుల ట్రెండ్ లో మరో బ్లాక్ బస్టర్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇది స్టార్ హీరో నటించింది కాకపోయినా సినీ ప్రియులు ఎదురు చూస్తున్న క్లాసిక్ గా ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. బొమ్మరిల్లుని ఈ సెప్టెంబర్ 21న మరోసారి థియేటర్లకు తీసుకొస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో భాస్కర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సిద్దార్థ్, జెనీలియా జంటగా రూపొందిన ఈ లవ్ కం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అప్పట్లో భారీ చిత్రాలకు ధీటుగా వసూళ్లు సాధించింది. పలు చోట్ల రికార్డులు నమోదయ్యాయి. దేవి శ్రీ ప్రసాద్ పాటలు మ్యూజిక్ లవర్స్ ని సంవత్సరాల తరబడి వెంటాడుతూనే వచ్చాయి.

ముఖ్యంగా హాసిని క్యారెక్టర్ ని అమాయకత్వం, చలాకీతనం కలగలసిన తీరు యువతకు విపరీతంగా నచ్చేసింది. తండ్రి మాటని జవదాటలేని నిస్సహాయ కొడుకుగా తానేం కోల్పోతున్నాడో చూపించే పాత్రలో సిద్ధార్థ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కుదిరితే కప్పు కాఫీ డైలాగు అప్పట్లో ఊతపదంగా మారిపోయి రింగ్ టోన్ల దాకా వెళ్ళింది. ఏకంగా ఈ టైటిల్ తో ఒక సినిమా కూడా తీశారంటే ఏ స్థాయిలో ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. భద్ర షూటింగ్ జరుగుతున్న టైంలో ట్రయిల్స్ లో ఉన్న భాస్కర్ చెప్పిన కథ విన్న దిల్ రాజు క్షణం ఆలస్యం చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

2006లో విడుదలైన బొమ్మరిల్లు ఫైనల్ రన్ పూర్తయ్యేలోపు పాతిక కోట్ల దాకా వసూలు చేయడం ఒక సంచలనం. సిద్దార్థ్, జెనీలియా ఒక్క దెబ్బకు స్టార్లుగా మారిపోయారు. ఆ ఏడాది నంది అవార్డుల్లో ఏకంగా ఏడు పురస్కారాలు అందుకోవడం బొమ్మరిల్లు చేసిన అరుదైన ఫీట్. 54వ ఫిలిం ఫేర్ లో ఏకంగా పధి అవార్డులు రావడం ఇప్పటికీ చెప్పుకునే రికార్డు. ఓయ్, 3, ఆరంజ్ లాంటి ఫ్లాప్ మూవీస్ ని ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకున్న యూత్ ఇక బొమ్మరిల్లుని ఏ స్థాయిలో రిసీవ్ చేసుకుంటారో వేరే చెప్పాలా. సెప్టెంబర్ 21 చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు లేకపోవడం ఈ రీ రిలీజుకి కలెక్షన్ల పరంగా పెద్ద ప్లస్ కానుంది.