బిగ్‍బాస్‍: ఐతే గ్లామరు.. లేదంటే పులిహోర

‘బిగ్‍బాస్‍’ నుంచి నిజంగా ఓటింగ్‍ పరంగానే ఎలిమినేషన్లు జరుగుతాయా అనే ప్రశ్న దేవి నాగవల్లి ఎలిమినేషన్‍తో మరోసారి తెర మీదకు వచ్చింది. అనధికారిక పోల్స్ లో దేవి నాగవల్లికి క్లియర్‍గా మెహబూబ్‍పై లీడ్‍ దక్కింది. ఓటింగ్‍ శాతం పరంగా కూడా దేవి నాగవల్లికే ఎడ్జ్ వచ్చిందని, అయితే చివరి నిమిషంలో బిగ్‍బాస్‍ షో కమర్షియల్‍ లెక్కలు కన్సిడర్‍ చేసి మెహబూబ్‍కి బదులుగా దేవిని పంపించేసారని ఒక టాక్‍ వినిపిస్తోంది. అందులో నిజమెంత అనేది దేవి ఇంటర్వ్యూలు మొదలయితే కానీ తెలియదు. కానీ దేవి ఎలిమినేషన్‍ పట్ల చాలా మంది ఆగ్రహంతో వున్నారని సోషల్‍ మీడియా రియాక్షన్స్ లోనే తెలుస్తోంది.

బిగ్‍బాస్‍ గేమ్‍ని దేవిలా జెన్యూన్‍గా సూటిగా, సుత్తి లేకుండా ఆడే వాళ్లకు ఎక్కువ రోజులు వుండనివ్వరా అనేది చాలా మంది సంధిస్తోన్న సూటి ప్రశ్న. అమ్మాయిలయితే గ్లామర్‍ పండించాలి. అబ్బాయిలయితే అమ్మాయిల వెంట పడుతూ పులిహోర కలపాలి అన్న రీతిన బిగ్‍బాస్‍ షో నడుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోబోలు, మనుషుల టాస్క్ లో మెహబూబ్‍ ఆవేశంతో రెచ్చిపోయి, ఆ తర్వాత ఏడ్చేసి ఒక పెద్ద షోనే చేసాడు. అంతే కాకుండా షోలో నిలబడాలంటే అమ్మాయిలతో రిలేషన్‍ పెట్టుకోవాలంటూ స్టేట్‍మెంట్‍ కూడా ఇచ్చాడు.

ఇదంతా బిగ్‍బాస్‍ టీమ్‍కి అతడి నుంచి పోను పోను మంచి కంటెంట్‍ వస్తుందనే నమ్మకాన్ని పెంచడం వలన సిన్సియర్‍గా గేమ్‍ ఆడుతోన్న దేవిని పంపించేసి అతనికో అవకాశం ఇచ్చారనే టాక్‍ సర్వత్రా వినిపిస్తోంది. బిగ్‍బాస్‍ హౌస్‍లో ఎలా వుండాలనే దానిపై ఒక వారం గట్టిగా క్లాస్‍ పీకిన నాగార్జున తర్వాతి వారానికి మెత్తబడిపోవడం కూడా ఆడియన్స్ కు నచ్చట్లేదు.

హద్దు మీరి ప్రవర్తించిన సోహైల్‍, మెహబూబ్‍, మోనల్‍, అఖిల్‍ ఎవరికీ క్లాస్‍ తీసుకోకుండా సింపుల్‍గా బాగా ఆడారంటూ ఒక మాట చెప్పి ఆట పాటలతో వీకెండ్‍ కానిచ్చేసారు. సరిగ్గా గాడిన పడుతోందని జనం అనుకుంటోన్న టైమ్‍లో మరోసారి బిగ్‍బాస్‍ టీమ్‍ యాక్సలరేటర్‍ పైనుంచి కాలు తీసేసారు.