దెయ్యం సినిమాలో పూజా హెగ్డే

ఒకే కథను అటుఇటు మార్చి చూపిస్తారని కాంచన సిరీస్ మీద కామెంట్స్ ఉన్నా సరే దానికున్న కమర్షియల్ వేల్యూ పెద్దది. మూడో భాగం మీద యునానిమస్ గా నెగటివ్ టాక్ వచ్చినా మాస్ అండతో తెలుగులోనూ లాభాలు ఇచ్చిన ప్రాజెక్టుగా మిగిలిపోయింది. మునితో ఈ పరంపర మొదలుపెట్టిన లారెన్స్ ని తర్వాత ఎందరో దర్శకులు తన రూట్ ఫాలో అయిపోయి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు కాంచన 4కి రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ బాలీవుడ్ సంస్థ గోల్డ్ మైన్స్ దీని మీద 100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేందుకు రెడీ అయ్యిందని సమాచారం. స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేసుకుని ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నారు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాంచన 4లో హీరోయిన్ గా పూజా హెగ్డేని దాదాపుగా తీసుకున్నట్టేనని చెన్నై టాక్. ఇప్పటిదాకా తను హారర్ జానర్ లో నటించలేదు. రెండేళ్ల క్రితం తెలుగు, తమిళంలో వరస డిజాస్టర్లు పలకరించేసరికి హిందీ అవకాశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. సల్మాన్ ఖాన్ తో ఏరికోరి చేసిన కిసీకా భాయ్ కిసీకా జాన్ దారుణంగా పోయింది. ఇక రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ గురించి తెలిసిందే. అల వైకుంఠపురములో ఇచ్చిన సక్సెస్ కిక్ ఆ తర్వాత కొనసాగలేదు. ప్రస్తుతం షాహిద్ కపూర్ దేవాతో పాటు సూర్య – కార్తీక్ సుబ్బరాజ్ కాంబో మూవీలు తన చేతిలో ఉన్నాయి.

లారెన్స్ కు ఓకే చెబితే కొత్త రూట్ తీసుకున్నట్టు అవుతుంది. అయినా ఈ మధ్య దెయ్యాల సినిమాల పట్ల గ్లామర్ హీరోయిన్లు ఆసక్తి చూపిస్తున్నారు. రాశిఖన్నా, తమన్నా, త్రిష, హన్సిక ఇలా అందరూ ట్రై చేసి హిట్లు కొట్టినవాళ్ళే. ఎంత హారర్ అయినా సరే అందమైన భామలను తీసుకుని సినిమాకు గ్లామర్ టచ్ ఇచ్చే లారెన్స్ ఈసారి కూడా అదే చేయబోతున్నాడు. చంద్రముఖి 2 ఘోరంగా డిజాస్టర్ అయినా ఈసారి తన స్వీయ దర్శకత్వంలో బలమైన కంబ్యాక్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనా రాలేదు కాని త్వరలో ఆ లాంఛనం ఉండొచ్చు.