రాజ్‌కే ఆమె 70 లక్షలిచ్చిందట

ఈ మధ్య కొన్ని వారాల పాటు యువ కథానాయకుడు రాజ్ తరుణ్ వ్యక్తిగత వ్యవహారం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. లావణ్య అనే అమ్మాయి తనతో రాజ్ ఎన్నో ఏళ్ల పాటు సహజీవనం చేయడంతో పాటు, పెళ్లి కూడా చేసుకుని ఈ మధ్య తనను విడిచిపెట్టాడంటూ అతడి మీద కేసులు పెట్టి పలు ఆరోపణలు చేయడం.. దీని మీద రాజ్ ఎదురు దాడి చేయడం.. ఇద్దరి మధ్య గొడవ పతాక స్థాయికి చేరడంతో మీడియాలో ఈ వ్యవహారం చాలా రోజుల పాటు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ మధ్యే ఆ గొడవ కాస్త సద్దుమణిగినట్లు అనిపించింది. కానీ తాజాగా పోలీసులు ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం.. రాజ్‌ పేరును అందులో నిందితుడిగా పేర్కొనడం.. తనకు వ్యతిరేకంగా ఆధారాలున్నట్లు పేర్కొనడంతో మళ్లీ ఈ వ్యవహారం చర్చకు వచ్చింది.

ఇదే సమయంలో లావణ్య ప్రెస్ మీట్ పెట్టి మరోసారి రాజ్ మీద ఆరోపణలు, విమర్శలు చేసింది. ఈ సందర్భంగా ఆమె ఒక ఆశ్చర్యకర విషయం వెల్లడించింది. అందరూ అనుకుంటున్నట్లు రాజ్ తనను పోషించలేదని.. తనే అతణ్ని పోషించానని ఆమె చెప్పడం గమనార్హం.

తన తల్లిదండ్రులు రాజ్‌కు 70 లక్షలు డబ్బులు ఇచ్చారని ఆమె చెప్పింది. గతంలో రాజ్ సినిమాలు లేకుండా రెండేళ్లు ఖాళీగా ఉండిపోయాడని.. ఆ టైంలో తన తల్లిదండ్రులు తమకున్న స్థలాలు అమ్మి 70 లక్షల రూపాయల డబ్బు రాజ్‌కు ఇచ్చారని ఆమె తెలిపింది.

తమ స్థలాలు అమ్మిన తేదీలు, రాజ్‌కు డబ్బులు ఇచ్చిన చెక్కులకు సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని ఆమె చెప్పింది. మరోవైపు రాజ్‌కు మద్దతుగా మాట్లాడి తనతో గొడవ పడ్డ శేఖర్ బాషా గురించి లావణ్య మాట్లాడుతూ.. అతను పాపులారిటీ కోసమే తమ గొడవలో తలదూర్చి, ఆ ఫేమ్‌తో బిగ్ బాస్ షోలోకి వెళ్లాడని ఆమె ఆరోపించింది.