ఈసారి వైట్ల పంచ్.. జగన్ మీద

టాలీవుడ్ దర్శకుల్లో శ్రీను వైట్లది ఒక సెపరేట్ స్టయిల్. కమర్షియల్ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఆయనొకరు. ఇండస్ట్రీ జనాల మీదే సెటైర్లు వేస్తూ కామెడీ ట్రాక్స్ తీస్తాడని వైట్లకు పేరుంది. అంతే కాక ఏదైనా సినిమా సందర్భంగా తనను ఎవరైనా ఇబ్బంది పెడితే.. వాళ్ల పాత్రలను తర్వాతి సినిమాలో పెట్టేసి కౌంటర్లు వేయడం వైట్లకు అలవాటు.

‘ఆగడు’ సినిమాకు ముందు విలన్‌గా ప్రకాష్ రాజ్‌ను అనుకున్నాక, వైట్లతో గొడవ పడి ఆయన తప్పుకుంటే.. ఆయన ఓ ప్రెస్ మీట్లో చెప్పిన ఓ కవితనే డైలాగ్‌గా మార్చి ‘ఆగడు’లో సోనూ సూద్ చేసిన విలన్ పాత్రకు వాడేయడం వైట్లకే చెల్లింది. ఇలాంటివి వేరే సినిమాల్లో కూడా కొన్ని చేశాడు వైట్ల. అందులో కొన్ని స్పోర్టివ్‌గా సాగితే.. కొన్నేమో అవతలి వ్యక్తులకు ఇబ్బంది కలిగించాయి.

ఇక వర్తమానంలోకి వస్తే.. తన కొత్త చిత్రం ‘విశ్వం’ నుంచి రిలీజ్ చేసిన టీజర్లో వైట్ల మార్కు డైలాగ్ ఒకటి హైలైట్ అయింది. ‘‘మీరు కొట్టారు. తీసుకున్నాం. రేపు మాకు టైం వస్తుంది. మేమూ కొడతాం’’ అంటూ గోపీచంద్ సీరియస్‌గా ఒక డైలాగ్ చెప్పాడు. అది చూసిన వాళ్లందరికీ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓ సందర్భంలో చెప్పిన డైలాగ్ గుర్తుకు వచ్చే ఉంటుంది.

2014 ఎన్నికల్లో ఓటమి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. యాజిటీజ్ ఇదే డైలాగ్ చెప్పాడు జగన్. అన్న ప్రకారమే తర్వాతి ఎన్నికల్లో జగన్‌కు టైమొచ్చింది. ప్రత్యర్థులను గట్టిగా కొట్టాడు. కానీ ఇప్పుడు జగన్ పరిస్థితి వేరుగా ఉంది. 2014కు మించిన కోలుకోలేని దెబ్బ తిని.. కేవలం 11 సీట్లకు పరిమితమైపోయారు. ఇలాంటి టైంలో జగన్ పాత డైలాగ్‌ను పెట్టడం అంటే ఆయనకు ఎలివేషన్ ఇవ్వడం కాకుండా కౌంటర్ వేసినట్లే అనిపిస్తుంది జనాలకు. మరి జగన్ అభిమానులు ఈ డైలాగ్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.