డబుల్ రిస్క్ చేస్తున్న సుహాస్

ఒకే హీరో సినిమాలు తక్కువ గ్యాప్ లో విడుదల కావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సేఫ్ కాదు. ఇటీవలే రాజ్ తరుణ్ తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది. కేవలం వారం నిడివిలో పురుషోత్తముడు, తిరగబడరా సామీ ఒకదాన్ని మించి మరొకటి బోల్తా కొట్టాయి. అలాని అన్నింటికీ ఇలాగే జరుగుతుందని కాదు కానీ మార్కెట్ కోణంలో చూసుకుంటే పదే పదే ప్రేక్షకులను పలకరించడం ఇమేజ్ పరంగానూ రిస్కే. కానీ సుహాస్ కూడా దీనికి సై అనేలా ఉన్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో నటించిన జనక అయితే గనక సెప్టెంబర్ 7 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

ట్రైలర్ వచ్చాక మంచి బజ్ ఏర్పడుతోంది. కండోమ్ కంపెనీ మీద కేసు పెట్టే విచిత్రమైన పాయింట్ తో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. ఇదిలా ఉండగా పట్టుమని రెండు వారాలు తిరక్కుండానే సెప్టెంబర్ 20 గొర్రె పురాణం రిలీజ్ చేయాలనే ప్లానింగ్ జరుగుతోంది. న్యూస్ పేపర్లలో యాడ్లు ఇవ్వడం మొదలుపెట్టారు. తక్కువ గ్యాప్ మొదటి ఇబ్బంది అయితే 27న జూనియర్ ఎన్టీఆర్ దేవర వస్తున్న నేపథ్యంలో టాక్ పికప్ అయ్యేలోపు సుహాస్ మూవీని థియేటర్ల నుంచి తీయాల్సిన సిచువేషన్ రావొచ్చు. ప్రాక్టికల్ గా చూస్తే ఇదే వాస్తవం.

మరి గొర్రె పురాణం మనసు మార్చుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. రెండు వైవిధ్యమైన కాన్సెప్ట్స్ తో రూపొందినవే. రైటర్ పద్మభూషణ్ టైంలోనే ఎక్కువ సినిమాలు ఒప్పేసుకున్న సుహాస్ సమాంతరంగా నాన్ స్టాప్ గా షూటింగుల్లో పాల్గొన్నాడు. దీంతో నిర్మాతలకు రిలీజ్ డేట్లు సెట్ చేసుకోవడం పెద్ద సమస్యగా మారింది. జనక అయితే గనక, గొర్రె పురాణంలకు ఇది ఎదురయ్యింది. పెద్ద హీరోలే జనాన్ని థియేటర్లకు రప్పించేందుకు కష్టపడుతున్న టైంలో సుహాస్ మంచి స్పీడ్ ప్రదర్శిస్తున్నాడు. కీర్తి సురేష్ తో కలిసి ఉప్పు కప్పురంబు చేస్తున్న సంగతి తెలిసిందే.