3 కోట్ల ఓపెనింగ్…ఇంద్ర ఫ్యాన్స్ హ్యాపీనా

నిన్న రీ రిలీజైన ఇంద్ర 3 కోట్ల 5 లక్షల గ్రాస్ సాధించినట్టు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. నిజానికి మెగాభిమానులు ఈ నెలలోనే వచ్చిన మురారి రికార్డులను బద్దలు కొడుతుందని ఆశించారు కానీ అది నెరవేరే సూచనలు తక్కువగా ఉన్నాయి. అయితే ఒక ప్రత్యేక మైలురాయి మాత్రం ఇంద్ర అందుకుంది. ఇప్పటిదాకా సీనియర్ హీరోల రీ రిలీజుల్లో అత్యధిక రెవిన్యూ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇంకా రన్ కొనసాగుతుంది కాబట్టి అప్పుడే నిర్ధారణకు రాలేం. మన్మథుడు, చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు లాంటివి బాగా దూరంలో ఉన్నాయి.

అయితే ఇంద్ర స్టామినా ఎంతనే ప్రశ్న వేసుకుంటే దాని స్థాయికి తగ్గట్టు ఫిగర్లు నమోదు కాలేదనేది వాస్తవం. ఎందుకంటే ప్రమోషన్లకు కేవలం వారం రోజులే పెట్టుకోవడంతో పాటు థియేటర్ కేటాయింపు విషయంలో జరిగిన ఆలస్యం వసూళ్ల మీద ప్రభావం చూపించింది. పైగా ఆయ్ మంచి ఊపులో ఉండగా, తంగలాన్ కు సైతం స్క్రీన్లు పెరిగాయి. ఫ్లాప్ అయినా సరే అగ్రిమెంట్ల వల్ల మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లకు రెండో వారంలో చెప్పుకోదగ్గ షోలైతే ఇచ్చారు. ఆగస్ట్ రెండో వారంలో వచ్చిన కమిటీ కుర్రాళ్ళు, బాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్త్రీ 2 వల్ల మల్టీప్లెక్సుల్లోనూ ఎక్కువ షోలు దొరకలేదు.

ఈ వీకెండ్ గరిష్టంగా ఎంత రాబడుతుందనేది ఇంద్రకు కీలకంగా నిలుస్తుంది. ఎందుకంటే సరిపోదా శనివారం ఆగస్ట్ 29 వచ్చేస్తుంది. నాగార్జున మాస్ ఒక రోజు ముందు 28న రీ రిలీజ్ చేస్తున్నారు. సో వీలైనంత వసూలు చేసుకోవడం ఇంద్రకి కీలకం. లెక్కల సంగతి పక్కనపెడితే ఇంద్రని ఒక పండగలా సింగల్ స్క్రీన్లలో ఎంజాయ్ చేయడం వీడియోల రూపంలో తెగ వైరలయ్యింది. ఏబీసీ సెంటర్ అనే తేడా లేకుండా ఫ్యాన్స్ వెల్లువలా ఇంద్రని మొదటి రోజు చూశారు. గురువారం వీక్ డే కావడం కొంత ప్రభావం చూపించినా ఫైనల్ గా మర్చిపోలేని అనుభూతిని అందుకున్నామని ఫ్యాన్స్ సంబరపడ్డారు.