వివాదాన్ని చల్లార్చిన నాని మెచ్యూరిటీ

న్యాచురల్ స్టార్ నాని ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ తనదైన పరిణితితో హీరోగా మారుతున్నాడు. కల్కిలో ప్రభాస్ ని ఉద్దేశించి బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్లు ఎంత దుమారం రేపాయో చూస్తున్నాం. తాజాగా మా అసోసియేషన్ దీన్ని సినీటా ప్రెసిడెంట్ పూనమ్ థిల్లాన్ దాకా తీసుకెళ్లింది. చర్యలు ఏముంటాయో చెప్పలేం కానీ తమ యాక్టర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదనే సందేశం టాలీవుడ్ వైపు నుంచి వెళ్లినట్టయ్యింది. ఇటీవలే సరిపోదా శనివారం ప్రెస్ మీట్లో నాని ఒక జర్నలిస్ట్ ప్రశ్నకు సమాధానంగా అర్షద్ వార్సీ మీద గట్టి చురకలు వేసిన సంగతి తెలిసిందే.

విషయం కాస్తా దూరం వెళ్లిపోవడం నాని పొరపాటు గుర్తించాడు. అర్షద్ అన్న మాటలు పూర్తిగా చూడకుండా కౌంటర్ వేసినట్టు అర్థమై దాన్ని వెనక్కు తీసుకున్నాడు. తమ ఇద్దరి కామెంట్లు వేరే అర్థంలో జనంలోకి వెళ్ళిపోయాయని వివరించాడు. నిజానికి నాని సైలెంట్ గా ఉన్నా నష్టం ఏమి లేదు. సరిపోదా శనివారం హిందీ వెర్షన్ కు ఒకవేళ ముంబై మీడియా అదే పనిగా నెగటివిటీ తీసుకొచ్చినా సరే సినిమా బాగుంటే నార్త్ జనాలు థియేటర్లకు వస్తారని గతంలో ఋజువయ్యింది. కబీర్ సింగ్, యానిమల్ మీద నడిపించిన క్యాంపైన్లు ఎలాంటి ఫలితాలు ఇవ్వకపోగా రివర్స్ అయ్యాయి.

అయినా సరే నాని ఎలాంటి గొడవ రాకూడదనే ఉద్దేశంతో ఇష్యూని చల్లార్చే ప్రయత్నం చేశాడు. సోషల్ మీడియాలో తనను అర్థం చేసుకోకుండా కొందరు బురద జల్లే ప్రయత్నాలు మొదలుపెట్టడంతో దాన్ని చక్కదిద్దడం మంచి విషయమే. చిన్న మాటకే రచ్చ జరిగే ఎక్స్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఇలా సెటిల్డ్ గా ప్రవర్తించడం అవసరం. ఊరికే రెచ్చగొడుతూ పోతే చిచ్చు మరింత పెద్దది అవుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం కలగదు. అర్షద్ వార్సీ అన్నది రైటా రాంగా అనేది కాసేపు పక్కన పెడితే అతను తన కన్నా చాలా సీనియరని నాని గుర్తించడం మెచ్యూరిటీకి నిదర్శనం.