ఒక్క క్యారెక్టర్.. ఎన్ని పేర్లయ్యా బాబూ

సుకుమార్‌, అల్లు అర్జున్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రం.. పుష్ప. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్, ‘అల వైకుంఠపురములో’ తర్వాత బన్నీ కలిసి చేస్తున్న సినిమా కావడం.. ఇంతకుముందు వీళ్ల కలయికలో ‘ఆర్య’, ‘ఆర్య-2’ లాంటి క్రేజీ సినిమాలు రావడంతో ‘పుష్ప’ మీద అంచనాలు మామూలుగా లేవు.

ఐతే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దగ్గర్నుంచి షూటింగ్ మొదలవడం వరకు అన్నీ ఆలస్యమవుతూనే ఉన్నాయి. అలాగే ఇందులో విలన్ పాత్ర విషయంలో ఏడాదిగా చర్చ జరుగుతోంది. కానీ ఆ చర్చ ఎంతకీ ఆగట్లేదు. ఎప్పటికప్పుడు పేర్లు మారిపోతున్నాయి.. కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. కానీ ఏదీ ఖరారవ్వట్లేదు. ముందుగా విజయ్ సేతుపతిని ఆ పాత్ర కోసం అనుకున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. చాన్నాళ్ల పాటు ఆ పేరే ప్రచారంలో ఉంది.

కానీ తనకు ఇచ్చిన పాత్ర ఎంతగానో నచ్చినప్పటికీ.. కరోనా వల్ల షెడ్యూళ్లన్నీ తారుమారై డేట్లు సర్దుబాటు చేయలేక ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత అరవింద్ స్వామి, బాబీ సింహా, నారా రోహిత్.. ఇలా రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఒక దశలో బాలీవుడ్ నుంచి ఎవరినైనా తీసుకుందామా అని సుకుమార్ ఆలోచిస్తున్నట్లు కూడా గుసగుసలు వినిపించాయి. కానీ ఎంతకీ ఆ పాత్ర ఎవరు ఖరారయ్యారన్నది తేలలేదు.

ఇప్పుడేమో కొత్తగా మాధవన్ పేరు వినిపిస్తోంది ఆ పాత్రకు. ‘సవ్యసాచి’ సినిమా ఆడకపోయినా ఆ సినిమాలో విలన్ పాత్రతో మెప్పించి.. ‘నిశ్శబ్దం’లోనూ ఓ విలక్షణ పాత్రలో కనిపించనున్న మాధవన్‌ను ‘పుష్ప’లో విలన్‌ పాత్రకు పరిశీలిస్తున్నారంటూ ఒక రూమర్ వినిపిస్తోంది. మరి ఇదెంత వరకు నిజమన్నది తెలియదు. అన్నీ కుదిరితే నవంబర్లో ‘పుష్ప’ చిత్రీకరణ మొదలుపెట్టాలనుకుంటున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.