ఒరిజినల్ చంద్రముఖిని ఎగబడి చూస్తున్నారు

హారర్ కామెడీ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమా ఏదంటే ఠక్కున గుర్తొచ్చే పేరు చంద్రముఖి. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ తో దెయ్యం సబ్జెక్టుని ట్రై చేయడం ఒక్క పి వాసు వల్లే సాధ్యమయ్యింది. ఇది కన్నడ ఆప్తమిత్ర రీమేకన్న సంగతి చాలా మందికి తెలిసిన విషయమే. అయితే వీటికి అసలు మూలం 1993లో రిలీజైన మలయాళం మూవీ మణిచిత్రతజు. 2004లో కన్నడ, 2005లో తమిళంలో పునఃనిర్మించారు. ఇదే కథని తిప్పి తీసి వెంకటేష్ హీరోగా నాగవల్లిగా తీశారు కానీ దారుణంగా పోయింది. ఇప్పడీ టాపిక్ తీసుకురావడానికి ప్రత్యేక కారణముంది.

ఒరిజినల్ చంద్రముఖిగా చెప్పుకునే మణిచిత్రతజు ఇవాళ రీ రిలీజయ్యింది. 4కె రీ మాస్టర్ చేయడమే కాదు డాల్బీ అట్మోస్ లో కొత్తగా రీ రికార్డింగ్ చేయించారు. యూట్యూబ్ ట్రైలర్ చూస్తేనే క్వాలిటీ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. నిజానికి 1993లో డీటీఎస్ సాంకేతికత లేదు. కానీ ఇప్పుడు దాని అనుభూతిని ఆస్వాదించాలంటే టెక్నాలజీ అవసరం. అందుకే మళ్ళీ సౌండ్ మిక్స్ అవసరమయ్యింది. సరే ఇప్పటి ఆడియన్స్ దీన్ని చూస్తారా అనే అనుమానాలు పటాపంచలు చేస్తూ అడ్వాన్స్ బుకింగ్ లోనే ముప్పై వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం చూసి ట్రేడ్ ఆశ్చర్యపోయింది.

హైదరాబాద్ లోనూ రెండు మూడు షోలు ఇస్తే అవి కూడా హౌస్ ఫుల్ దిశగా వెళ్తున్నాయి. మోహన్ లాల్, సురేష్ గోపి నటించిన మణిచిత్రతజులో జ్యోతిక పాత్రను శోభన చేసింది. అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేస్తుంది. అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ క్లాసిక్ ఇతర భాషల్లో రావడానికి బాగా సమయం తీసుకుంది. తెలుగులో కూడా ఇలాంటి ఆల్ టైం హిట్స్ వెలికి తీసి కొత్తగా సౌండ్ మిక్స్ చేయిస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. మాయాబజార్ ని కలర్ లోకి మార్చినప్పుడు మాత్రమే ఇలా చేశారు. భవిష్యత్తులో శివ, ఆదిత్య 369, జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి క్లాసిక్స్ కి చేయిస్తే ఎంత బాగుంటుందో.