ప్రేక్షకులను చెడగొట్టింది మేమే – దిల్ రాజు

ఇండస్ట్రీ పోకడల గురించి అగ్ర నిర్మాతలు నిజాలు మాట్లాడ్డం అరుదు. అయితే దిల్ రాజు చాలాసార్లు దానికి మినహాయింపు ఇస్తుంటారు. నిన్న జరిగిన రేవు అనే చిన్న సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మరోసారి ఇది బయట పడింది. తన ప్రసంగంలో ట్రెండ్ గురించి మాట్లాడుతూ ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా మేమే చెడగొట్టామని, నాలుగు వారాలకే ఓటిటిలో తెస్తాం, మీరు ఇంట్లోనే ఉండండని చెప్పడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పుకొచ్చారు. కంటెంట్ బాగుంటే బలగం, కమిటీ కుర్రోళ్ళు లాగా నెమ్మదిగా అయినా జనం వస్తారని ఆ విజయాలను ఉదాహరణగా చూపారు.

సరైన సందర్భంలో దిల్ రాజు సరైన మాటే అన్నారు. ఎందుకంటే మరీ నెల రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ వల్ల వసూళ్లు ప్రభావితం చెందుతున్న మాట వాస్తవం. సలార్, గుంటూరు కారం, టిల్లు స్క్వేర్, ది ఫ్యామిలీ స్టార్ లాంటి స్టార్ హీరోల చిత్రాలన్నీ త్వరగా ఓటిటిలో వచ్చేయడం చూశాం. హనుమాన్, కల్కి 2898 ఏడి ఆలస్యం చేయడం వాటికి చాలా ప్లస్ అయ్యింది. థియేటర్ రెవిన్యూ బాగా రావాలని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా గ్యాప్ పెద్దది ఉండాలి. లేదూ డిజిటల్ కంపెనీలు ఎక్కువ రేట్ ఇస్తున్నాయని ఆశపడితే బంగారు బాతును కోసుకుని తిన్న అమాయకుడి కథ గుర్తొస్తుంది.

క్రమంగా కొన్ని కఠిన పద్ధతులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాలీవుడ్ లో చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ సినిమా యాభై రోజులు దాటకుండా ఓటిటికి రాదు. ఒకవేళ ఆలా చేసే పక్షంలో తమ స్క్రీన్లను ఇవ్వమని మల్టీప్లెక్సులు అల్టిమేటం ఇచ్చాయి. దానికి అనుగుణంగానే నిర్మాతలు దాన్ని పాటిస్తున్నారు. మలయాళంలోనూ ఇటీవలే ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టారు. తమిళనాడులో నిర్మాతల సమాఖ్య కొన్ని వారాల క్రితమే ఆంక్షలతో కూడిన మార్గదర్శకాలు విడుదల చేశారు. సో ఇక మిగిలింది మన వైపు మాత్రమే. దిల్ రాజు గారే అన్నారు కాబట్టి ఆ దిశగా మార్పు వస్తుందేమో చూడాలి.