జాతీయ గౌరవం అందుకున్న కార్తికేయ 2

ఇవాళ 70న జాతీయ సినిమా అవార్డుల ప్రకటన అధికారికంగా వచ్చేసింది. వివిధ బాషల నుంచి ఎంపిక చేసిన చిత్రాలకు, విజేతలకు పురస్కారాలు అందించబోతున్నారు. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 ఎంపికయ్యింది. నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ ప్యాన్ ఇండియా మూవీ 2022లో విపరీతమైన పోటీ మధ్య విడుదలై భారీ ఎత్తున విజయం సాధించడం తెలిసిందే. సరైన థియేటర్లు తొలుత దొరక్కపోయినా విజయం సాధించాక నార్త్ నుంచి సౌత్ దాకా అన్ని చోట్లా విజయకేతనం ఎగరేసింది. ఇప్పుడీ కీర్తి దక్కింది.

ఉత్తమ చిత్రంగా మలయాళం మూవీ ఆట్టంకు అగ్ర తాంబూలం దక్కింది. బెస్ట్ యాక్టర్ గా రిషబ్ శెట్టి కాంతారకు గాను విన్నర్ గా నిలిచాడు. రీజనల్ మూవీస్ క్యాటగిరీలో కన్నడ కెజిఎఫ్ 2, తమిళం పొన్నియిన్ సెల్వన్ 1 అవార్డులు గెలిచాయి. ఉత్తమ దర్శకుడు సూరజ్ ఆర్ బరజాత్య (ఊంచాయి), విజువల్ ఎఫెక్ట్స్ (బ్రహ్మాస్త్ర పార్ట్ 1), హోల్ సం ఎంటర్ టైన్మెంట్ (కాంతార), సినిమాటోగ్రఫీ (పీఎస్ 1), గాయకుడు ఆర్జిత సింగ్ (బ్రహ్మాస్త్ర), గాయని బాంబే జయశ్రీ (చాయుమ్ మెయిల్), చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీపథ్ (మల్లికాపురం), స్క్రీన్ ప్లే ఆనంద్ ఏకర్షి (అట్టం) కు వివిధ విభాగాల్లో పురస్కారం గెలుచుకున్నారు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు గాను ఏఆర్ రెహమాన్ కు పొన్నియిన్ సెల్వన్ 1కు గాను అవార్డు రాగా, ఉత్తమ సంగీతం బ్రహ్మాస్త్ర చేతికి వెళ్లిపోయింది. కొరియోగ్రఫీ జానీ మాస్టర్ – సతీష్ కృష్ణన్ (తిరుచిత్రంబలం), సౌండ్ డిజైన్ పీఎస్ 1 ఖాతాలో చేరింది. తెలుగు సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కలేదు కానీ ఉన్నంతలో కార్తికేయ 2 కు ఎక్కువ గుర్తింపు వచ్చింది. వివిధ ప్రామాణికాలను ఆధారంగా చేసుకుని ఇచ్చే జాతీయ అవార్డులు మరిన్ని టాలీవుడ్ కు రావాల్సింది కానీ ఈసారి సర్దుకోవాల్సిందే. 2023 సంవత్సరానికి ఎక్కువ నామినేషన్లు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం.