మెగాస్టార్‍ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు

మెహర్‍ రమేష్‍తో సినిమా చేస్తున్నట్టు చిరంజీవి కూడా అధికారికంగా ప్రకటించేసారు. అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలయ్యేదీ ఆయన స్పష్టత ఇవ్వలేదు. లూసిఫర్‍ రీమేక్‍ వినాయక్‍తో, వేదళాం రీమేక్‍ మెహర్‍తో ఖాయం చేసుకున్నారు. లూసిఫర్‍ గురించి వినాయక్‍ వైపు నుంచి ఎలాంటి అప్‍డేట్‍ లేదు. కానీ మెహర్‍ రమేష్‍ సినిమా మాత్రం ఏదో ఒక రకంగా వార్తల్లో నానుతూనే వుంది.

ఇంకా చెప్పాలంటే ముందుగా రావాల్సిన ‘ఆచార్య’ కంటే ఈ చిత్రం గురించే మీడియాలో ఎక్కువగా రాస్తున్నారు. రాక రాక వచ్చిన అవకాశాన్ని ఎలాగయినా సద్వినియోగం చేసుకోవాలని, మెగాస్టార్‍ మనసు మార్చుకోకముందే ఈ చిత్రానికి అన్నీ ఖాయం చేసేసి పెట్టేయాలని మెహర్‍ తొందర పడుతున్నట్టున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక ట్యూన్‍ రెడీ చేయించేసాడట. తాజాగా కెజిఎఫ్‍ ఫైట్‍ మాస్టర్లను తీసుకెళ్లి చిరంజీవితో మీటింగ్‍ పెట్టించాడట.

అలాగే సాయి పల్లవిని చెల్లెలి పాత్రకు ఓకే చేయడం కోసం ఇప్పట్నుంచే ఆమె మేనేజర్‍ చుట్టూ తిరుగుతున్నాడట. ఆచార్య షూటింగ్‍ పూర్తయ్యేలోగా ఈ చిత్రానికి అన్నీ సిద్ధం చేసేసి, లూసిఫర్‍ కంటే ముందు ఈ చిత్రాన్ని మెగాస్టార్‍ మొదలు పెట్టేలా చేయాలనేది మెహర్‍ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి అనిల్‍ సుంకర నిర్మాత అంటున్నారు కానీ ఇంతవరకు అధికారికంగా ధృవీకరించలేదు.