మ్యాడ్ మాస్ కాంబో.. ఆరంభం రేపే

ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న సినిమా ఎంతకీ పట్టాలెక్కట్లేదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఓ అసంతృప్తి ఉంది. అది కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తీయబోతున్న చిత్రమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి కాంబినేషన్ మూడేళ్ల కిందటే ఓకే అయింది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేయనున్న చిత్రమిది. సలార్ కంటే ముందే ఈ చిత్రం అనుకున్నప్పటికీ రకరకాల కారణాల వల్ల ఆలస్యమైంది.

‘సలార్’ రిలీజ్ తర్వాత దానికి సీక్వెల్ తీయడానికి ప్రశాంత్ రెడీ అవుతున్నాడన్న వార్తలతో తారక్ మూవీ ఎప్పుడా అనే ప్రశ్నలు తలెత్తాయి. అసలీ సినిమా ఉంటుందా లేదా అన్న డౌట్లు కూడా వచ్చాయి. ఐతే ‘సలార్-2’ను వెనక్కి నెట్టి తారక్ సినిమా చేయడానికే ప్రశాంత్ ఇప్పుడు రెడీ అవడం నందమూరి అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది.

తారక్-ప్రశాంత్ నీల్‌ల మ్యాడ్ మాస్ కాంబో మూవీకి ముహూర్తం కూడా కుదిరింది. శుక్రవారమే ఈ చిత్రానికి రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ వేడుకను కొంచెం సింపుల్‌గానే చేయబోతున్నారట. తారక్, ప్రశాంత్ ఇద్దరూ ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. ఏదో మొక్కుబడిగా ప్రారంభోత్సవం చేయడం కాదు.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేస్తారని అంటున్నారు.

తారక్ ఆల్రెడీ ‘దేవర-1’కు సంబంధించి తన పని అంతా దాదాపుగా పూర్తి చేసేశాడని సమాచారం. డబ్బింగ్ వర్క్ మాత్రం కొంత పెండింగ్ ఉందట. ప్రశాంత్‌తో తారక్ చేయనున్న చిత్రానికి ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నారు. ప్రశాంత్ ఇప్పటిదాకా చేసిన సినిమాలకు ఇది కొంచెం భిన్నంగా ఉంటుందని సమాచారం.