ఒకేసారి ఓజీ, రాజాసాబ్, గేమ్ చేంజర్ అప్‌డేట్స్

సోషల్ మీడియాలో ఉండే స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు తమ స్టార్ల సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కావాలి. పదే పదే అప్‌డేట్స్ అంటే ఎలా అంటూ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు ఫ్యాన్స్‌కు క్లాస్ పీకినా.. వాళ్ల ఆలోచన తీరు మారదు.

ఈ విషయంలో ఫలానా హీరో ఫ్యాన్స్ మినహాయింపు అనడానికి వీల్లేదు. అందరిదీ ఇదే బాధ. ఒక క్రేజీ మూవీలో భాగమైన ఏ ఆర్టిస్ట్, టెక్నీషియన్ సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చినా.. అప్‌డేట్ అడుగుతారు.

ప్రస్తుతం టాలీవుడ్లో బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా తన చేతుల్లో ఉన్న క్రేజీ మూవీస్ గురించి అభిమానులు ప్రశ్నలు వేశారు. దానికి తమన్ ఓపిగ్గా సమాధానాలు ఇచ్చాడు.

సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ నుంచి ఒక టీజర్ మాత్రమే వచ్చింది. ఈ సినిమా షూట్ హోల్డ్‌లో ఉండగా… కనీసం ఈ సినిమా నుంచి పాటలైనా రిలీజ్ చేయొచ్చు కదా అని అభిమానులు కోరుతున్నారు.

ఇదే విషయాన్ని తమన్ దగ్గర ప్రస్తావిస్తే.. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడం గురించి తాను, దర్శకుడు సుజీత్ మాట్లాడుకుంటున్నామని.. అతి త్వరలోనే దీనికి సంబంధించి అప్‌డేట్ ఉంటుందని తెలిపాడు. ఇక ప్రభాస్ మూవీ ‘రాజా సాబ్’ నుంచి మ్యూజిక్ ట్రీట్ ఎప్పుడు అని తమన్‌ను అడిగితే.. ఏప్రిల్లో ఈ చిత్రం రిలీజవుతున్న నేపథ్యంలో జనవరి నుంచి ఒక్కో పాట లాంచ్ చేస్తూ వెళ్తామని తమన్ వెల్లడించాడు.

రామ్ చరణ్ మూవీ ‘గేమ్ చేంజర్’ నుంచి రెండో పాట గురించి అడిగితే.. ఈ నెలాఖర్లో ఉండొచ్చని, ప్రమోషన్లు కూడా అప్పట్నుంచే మొదలవుతాయని చెప్పాడు. బాబీ-బాలయ్య సినిమా గురించి ప్రశ్నిస్తే.. ఈ సినిమా రష్ చూశానని.. ఒక్క మాటలో చెప్పాలంటే పండగే అని అభిమానులను ఊరించాడు తమన్.