ఇస్మార్ట్ పాట గొడ‌వ‌.. మ‌ణిశ‌ర్మ ఏమ‌న్నాడంటే?

రామ్- పూరి జ‌గ‌న్నాథ్‌ల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న డ‌బుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి ఇటీవ‌లే రిలీజ్ చేసిన మార్ ముంత చోడ్ చింత అనే పాట మీద వివాదం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. .ఈ పాట మధ్యలో రెండు చోట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాపులర్ డైలాగ్‌ను వాడారు. ‘ఐతే ఏం చేద్దామంటావ్ మరి’ అనే కేసీఆర్ డైలాగ్.. మీమ్స్‌ ద్వారా బాగా పాపులరైన సంగతి తెలిసిందే. ఈ డైలాగ్‌ను పాటలో సందర్భానుసారంగా, సరదాగా వాడుకుంది ‘డబుల్ ఇస్మార్ట్’ టీం.

ఐతే కల్లు కాంపౌండ్లో నడిచే పాటలో మాజీ ముఖ్యమంత్రి డైలాగ్ వాడడం అంటే ఆయనతో పాటు తెలంగాణ సమాజాన్ని కించపరచడమే అని.. తెలంగాణ అంటే తాగుడుకు కేంద్రం అన్న ఉద్దేశంతో ఈ పాట తీశారని కొందరు తెలంగాణ వాదులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వాక్యాల‌ను తీసేయ‌కుంటే సినిమాను అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించారు కూడా.

ఈ నేప‌థ్యంలో సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశర్మ వివాదంపై స్పందించారు. ఈ పాట‌తో ఎవ‌రినీ కించ‌ప‌రిచే ఉద్దేశం లేద‌ని మ‌ణిశ‌ర్మ స్ప‌ష్టం చేశారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. “కేసిఆర్‌ అందరికీ ఇష్ణమైన వ్యక్తి. ఆయన పలు సందర్భాల్లో మాట్లాడిని మాటలు మీమ్స్‌లో చాలా పాపులర్‌ అయ్యాయి. దాన్నే తీసుకుని పాటలో వాడాము. ఉద్దేశపూర్వకంగా వారిని కించపరచాలని, నొప్పించాలని పెట్టలేదు. సంగీత దర్శకుడిగా నా 27 ఏళ్ల కెరీర్‌లో ఎవరినీ నొప్పించలేదు. కేసీఆర్‌ను జస్ట్‌ ఈ పాటలో తలుచుకున్నామంతే. కేసిఆర్‌ డైలాగ్‌నుపెట్టడం తప్పుగా భావించవద్దు. అది ఐటెమ్‌ సాంగ్‌ కూడా కాదు. హీరోహీరోయిన్ల మధ్య డ్యూయెట్‌ సాంగ్” అని వివ‌ర‌ణ ఇచ్చారు.

ఇదే ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న గేయ ర‌చ‌యిత కాస‌ర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ఈ పాట‌లో ఎంజాయ్ పండ‌గో లాంటి వేరే మీమ్ వర్డ్స్ కూడా ఉన్నాయ‌ని.. కేసీఆర్ మాట‌ల‌ను కూడా అలాగే చూడాల‌ని.. ఇదంతా స‌ర‌దాగా చేశామ‌ని.. ఇందులో ఎవ‌రినీ కించ‌ప‌రిచే ఉద్దేశం లేద‌ని స్ప‌ష్టం చేశాడు.