హరీష్ శంకర్ టచ్.. సుడి తిరిగినట్లే

ఒకప్పుడు రాఘవేంద్రరావు సినిమాలో నటిస్తే హీరోయిన్ల దశ తిరిగినట్లే అని పేరుండేది. కథానాయికలను చాలా అందంగా చూపించి వారి రాత మార్చేస్తాడని ఆయనకు పేరుండేది. ఆ తర్వాతి కాలంలో రాఘవేంద్రరావు శిష్యుల్లో ఒకరైన వైవీఎస్ చౌదరి కూడా ఇలాంటి గుర్తింపే సంపాదించాడు. ఈ తరంలో కొంతమేర ఇలాంటి ఇమేజ్ ఉన్న దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు.

‘మిరపకాయ్’లో నటించిన రిచా గంగోపాధ్యాయ, ‘గబ్బర్ సింగ్’లో చేసిన శ్రుతి హాసన్, ‘దువ్వాడ జగన్నాథం’లో నటించిన పూజా హెగ్డే తర్వాతి కాలంలో ఎంత బిజీ అయ్యారో తెలిసిందే. ‘గద్దలకొండ గణేష్’లో ఐటెం సాంగ్ చేసిన డింపుల్ హయతి సైతం తర్వాత వరుసగా ఛాన్సులు అందుకుంది. ఇప్పుడు హరీష్ కొత్త హీరోయిన్ కూడా ఇలాగే బిజీ అయ్యేలా కనిపిస్తోంది. హరీష్ కొత్త చిత్రం ‘మిస్టర్ బచ్చన్’లో భాగ్యశ్రీ బోర్సే అనే కొత్తమ్మాయి కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. మేకింగ్ దశలో ఉండగానే ఈ అమ్మాయి లుక్స్ గురించి చర్చ జరిగింది.

ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి ఒక్కో ప్రోమో రిలీజ్ చేస్తున్న కొద్దీ తనకు క్రేజ్ పెరిగిపోతోంది. సితార్ సాంగ్‌లో భాగ్యశ్రీ అందాలు ఎంతగా హైలైట్ అయ్యాయో తెలిసిందే. టాలీవుడ్లోకి మరో ఇలియానా వచ్చేసిందనే చర్చ జరిగింది. సోషల్ మీడియాలో భాగ్యశ్రీ పేరు మార్మోగుతున్న ఈ టైంలో ఆమెకు ఒక క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కినట్లు వార్తలొస్తున్నాయి.

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న సినిమాలో కథానాయికగా భాగ్యశ్రీని ఎంచుకున్నారట. ముందు ఈ సినిమాకు శ్రీలీలను అనుకున్నారు. తర్వాత ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంది. తన స్థానంలోకి భాగ్యశ్రీ వస్తుందని కొన్ని రోజుల ముందే చర్చ జరిగింది. ఇప్పుడు ఆ విషయమే నిజమైంది. విజయ్-గౌతమ్ సినిమాలో కథానాయికగా భాగ్యశ్రీనే ఖరారు చేశారట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో విజయ్ లుక్ లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. అభిమానులు సంయమనం పాటించాలని, త్వరలోనే అధికారికంగా ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తామని టీం ప్రకటించింది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందీ చిత్రం.