మెగా ప్లానింగ్ చేస్తున్న ప్రశాంత్ వర్మ

2024 అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందాని అభిమానులు ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళ నిరీక్షణ అంత సులభంగా ఫలించేలా లేదు. ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఆ రేంజ్ లో జరుగుతోంది కాబట్టి కొంత ఆలస్యం తప్పేలా లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇప్పుడు అతని ముందున్న అతి పెద్ద సవాల్ హనుమంతుడి పాత్రధారిని ఎంచుకోవడం. మొదటి భాగంలాగా సెకండ్ పార్ట్ స్టోరీ తేజ సజ్జ మీద నడవదు. అంజనీ పుత్రుడు చేసే విన్యాసాల మీద ఉంటుంది. దాన్ని వర్తమానానికి ముడిపెడతారట.

లెక్కలు వేసుకున్న బడ్జెట్ కి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా పెద్ద స్టార్ కావాలి. అది చిరంజీవి అయితేనే పర్ఫెక్టని ప్రశాంత్ వర్మ భావిస్తున్నట్టు టీమ్ నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఇదంత సులభం కాదు. ఎందుకంటే విశ్వంభర పూర్తయ్యాక మెగాస్టార్ దర్శకుడు మోహన్ రాజా ప్రాజెక్టుని మొదలుపెట్టే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ జై హనుమాన్ స్క్రిప్ట్ కనక నచ్చితే వెంటనే నిర్ణయం చెబుతారా లేదానేది సస్పెన్స్. ఎందుకంటే విశ్వంభర ఫలితం ఇక్కడ కీలక పాత్ర వహిస్తుంది. అతి తక్కువ గ్యాప్ లో రెండు ఫాంటసీ సినిమాలు చేయడం ఆయన కెరీర్ లో జరగలేదు.

హనుమాన్ నిర్మాత చైతన్య రెడ్డి ఇటీవలే డార్లింగ్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హనుమంతుడు అంటే చిరంజీవి లేదా రామ్ చరణ్ ని ఊహించుకుంటున్నామని చెప్పడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. ఇంటి దైవం క్యారెక్టర్ వేయమంటే చిరు ఎంతవరకు సుముఖంగా ఉంటరనేది కూడా వేచి చూడాలి. ఒకేఒక్కసారి జగదేకవీరుడు అతిలోకసుందరిలో ఆయన హనుమంతుడి గెటప్ లో కొన్ని నిముషాలు కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ జరగలేదు. సో ఏతావాతా ఇదంతా తేలాలంటే ఏడాది పట్టేలా ఉంది. ఈలోగా ప్రశాంత్ వర్మ నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా చేసే ఛాన్స్ లేకపోలేదు.