రజినీ ‘రానా’ మళ్లీ తెరపైకి

సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ ప్రయాణం విచిత్రంగా సాగుతోంది కొన్నేళ్లుగా. ఆరోగ్య సమస్యలేమీ లేనపుడు.. వేరే పనులు, బాధ్యతలు ఏమీ లేనపుడు ఆయన రెండు మూడేళ్లకు ఒక సినిమా చేసేవారు. కానీ కొన్నేళ్లుగా ఆయన్ని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి, పైగా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఇలాంటి సమయంలో ఆయన చూపిస్తున్న స్పీడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రెండేళ్లుగా ఆరు నెలలకు ఒక సినిమా లాగించేస్తున్నారు రజినీ.

రెండున్నరేళ్ల వ్యవధిలో ఆయన నటించిన ఐదు సినిమాలు (కబాలి, కాలా, 2.0, పేట, దర్బార్) విడుదల కావడం విశేషం. కరోనా లేకపోతే ఆయన కొత్త సినిమా ‘అన్నాత్తె’ కూడా ఈపాటికే విడుదలైపోయేది. ఇక రాజకీయ పార్టీ పనిలోకి దిగాల్సి ఉన్న నేపథ్యంలో రజినీ ఇక సినిమాలేవీ చేయరని చాలామంది అనుకున్నారు. కానీ ఆయన దర్శకులతో చర్చలు కొనసాగిస్తున్నారు.

‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో ఇంకో సినిమా అని ఆ మధ్య వార్తలొచ్చాయి. అలాగే తనతో చాలా సినిమాలు తీసిన సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌తో మళ్లీ జట్టు కట్టేందుకు కూడా రజినీ ప్రయత్నిస్తున్నట్లు వెల్లడి కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్ల కిందట చేయాల్సిన కథను ఇప్పుడు మళ్లీ బయటికి తీసే ప్రయత్నం జరుగుతుండటం విశేషం.

2011లో రవికుమార్ దర్శకత్వంలో రజినీ ‘రానా’ అనే సినిమాను మొదలుపెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి కథానాయికగా దీపికా పదుకొనేను ఫిక్స్ చేశారు. ఆమె సినిమా ప్రారంభోత్సవంలోనూ పాల్గొంది. అమితాబ్ బచ్చన్ అందులో ముఖ్య పాత్ర పోషించాల్సింది.

17వ శతాబ్దానికి చెందిన ఓ యోధుడి కథ అది. ఐతే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించిన రోజే రజనీకాంత్‌ అస్వస్థతకు గురవడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీన్ని నెగెటివ్ సెంటిమెంటుగా భావించాడో, ఎంతో శ్రమతో కూడుకున్న ఈ సినిమా చేయడం కష్టమనుకున్నాడో కానీ.. రజినీ ఈ సినిమాను క్యాన్సిల్ చేసేశాడు. దీని బదులు రవికుమార్ దర్శకత్వ పర్యవేక్షణలో, తన కూతురు సౌందర్య దర్శకత్వంలో ‘కోచ్చడయాన్’ చేశాడు.

కట్ చేస్తే.. తనను ఆరు నెలల కిందట ‘రానా’ కథ మళ్లీ చె్పమని రజినీ అడిగినట్లు తాజాగా రవికుమార్ వెల్లడించాడు. తాను కథ కూడా చెప్పానని.. అంతా విన్నాక ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా చేయగలమా అని రజినీ అడిగారని రవికుమార్ చెప్పాడు. బహుశా వచ్చే ఏడాది ఎన్నికలు అయ్యాక ఈ సినిమాను తెరపైకి తెచ్చినా ఆశ్చర్యం లేదేమో.