ఫిలిం క్రిటిక్స్‌పై 25 కోట్లకు కల్కి టీం దావా

బాహుబలి టైంలో బాలీవుడ్ సినీ ప్రముఖులు, క్రిటిక్స్ సౌత్ సినిమాల గురించి గొప్పగా మాట్లాడేవాళ్లు. కానీ ఆ సినిమా ఉత్తరాదిన కూడా సంచలన విజయం సాధించడం.. ఆ తర్వాత మరి కొన్ని చిత్రాలు ఉత్తరాదిన ఘనవిజయం సాధించడంతో హిందీ సినిమాలకు పెను ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొంది. అక్కడి ప్రేక్షకులు మన సినిమాలను నెత్తిన పెట్టుకుంటూ హిందీ చిత్రాలను విస్మరించడం మొదలుపెట్టడం బాలీవుడ్ జనాలు, క్రిటిక్స్‌కు కంటకింపుగా మారింది. దీంతో సౌత్ సినిమాలను ఎలివేషన్లు ఇవ్వడం మానేశారు. పైగా ఇక్కడి సినిమాలను టార్గెట్ చేయడం కూడా మొదలైంది.

ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమాలన్నింటినీ అక్కడి క్రిటిక్స్ చాలా వరకు డీగ్రేడ్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు. అయినా తన చిత్రాలకు అక్కడ భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ‘సలార్’ టైంలో కలెక్షన్ల గురించి ఎంత గొడవ జరిగిందో తెలిసిందే.

ఇప్పుడు ‘కల్కి’ సినిమా విషయంలోనూ అదే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సినిమా వసూళ్ల గురించి మేకర్స్ ప్రకటిస్తున్న ఫిగర్స్ గురించి మొదట్నుంచి కొందరు క్రిటిక్స్ కమ్ ట్రేడ్ అనలిస్ట్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. సమోసా క్రిటిక్స్ అని బాలీవుడ్ వాళ్లే ఎద్దేవా చేసే సుమిత్ కడేట్, రోహిత్ జైస్వాల్ అయితే.. ‘కల్కి’ రిలీజ్ దగ్గర్నుంచి అదే పనిగా ఆ సినిమాను టార్గెట్ చేస్తున్నారు. కలెక్షన్లు ఫేక్ అంటూ వరుసబెట్టి పోస్టులు పెడుతున్నారు. డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా ఆ సినిమాను డీగ్రేడ్ చేసేలా ట్వీట్లు వేస్తూనే ఉన్నారు. ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ల ఫిగర్ మీదా సెటైర్లు వేశారు.

ఐతే సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చాక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ వీళ్లకు గుణపాఠం చెప్పాలని డిసైడైంది. వీళ్లిద్దరి మీద రూ.25 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. కలెక్షన్ల గురించి వీళ్లు వేసిన ట్వీట్లు ప్రస్తావిస్తూ.. అవి నిజమని రుజువు చేయకపోతే రూ.25 కోట్లు కట్టాలని డిమాండ్ చేసింది. మరి ఈ నోటీసులపై ఆ ఇద్దరు క్రిటిక్స్ ఏం స్పందిస్తారో.. ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.