ఆల్ ఈజ్ వెల్ అంటున్న నవీన్ పోలిశెట్టి

గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో సూపర్ హిట్ అందుకున్నాక ఏకంగా పది నెలలు గ్యాప్ తీసుకున్న నవీన్ పోలిశెట్టి ఈ మధ్య కాలంలో మీడియాకు, అభిమానులకు అందుబాటులోకి రాలేదు. తన కొత్త సినిమా అప్డేట్స్ గురించి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కొంత ఆందోళన చెందిన మాటా నిజమే. దానికి చెక్ పెడుతూ నవీన్ పోలిశెట్టి స్వయంగా సోషల్ మీడియా వేదికగా తన ప్రస్తుత పరిస్థితి గురించి వివరణ ఇచ్చాడు. ఆ మధ్య జరిగిన ఒక ప్రమాదంలో తన చేతి ఎముకలకు మల్టిఫుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. కాలికి కూడా ఇంజురీ అయ్యింది. దీని వల్లే సుదీర్ఘమైన విశ్రాంతి అవసరమైంది.

డాక్టర్ల సలహాల మేరకు నవీన్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. వేగంగా సినిమాలు చేయాలని ఉన్నప్పటికీ ఆరోగ్య రిత్యా నెలల తరబడి బ్రేక్ తీసుకోవాల్సి రావడంతో తప్పని పరిస్థితుల్లో ఇలా చెప్పాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. త్వరలో చేయబోయే చిత్రాలు అత్యద్భుతంగా రూపొందేలా జాగ్రత్త వహిస్తున్నానని, వీలైనంత త్వరలో పూర్తిగా రికవర్ అయ్యాక క్రేజీ అప్డేట్స్ తో స్వయంగా ముందుకు వస్తానని చెప్పాడు. ఎప్పటి లాగే మీ ప్రేమను ఆశిస్తున్నానని చెబుతూ మీ జానేజిగర్ అంటూ సందేశాన్ని ముగించాడు. గాయాలతో ఉన్న ఫోటోని కూడా పోస్ట్ తో పాటు నవీన్ పోలిశెట్టి జోడించాడు.

మొత్తానికి సందేహాలకు చెక్ పెడుతూ నవీన్ పోలిశెట్టి ఇలా అఫీషియల్ గా స్పష్టత ఇవ్వడంతో అభిమానులు హమ్మయ్యా అనుకుంటున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఇలా వరస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న టైంలో అమెరికాలో జరిగిన ప్రమాదం నవీన్ కు స్పీడ్ బ్రేకర్ లా మారింది. అయితే తను చెప్పిన దాన్ని బట్టి కథలు వినడం, స్క్రిప్ట్ లలో భాగం కావడం మాత్రం ఆగలేదని స్పష్టమవుతోంది. కోలుకున్నాక ఏ దర్శకుడు, ఏ నిర్మాత, ఎవరెవరితో చేతులు కలపబోతున్నాడో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.