పెనుముప్పు తప్పించుకున్న గేమ్ ఛేంజర్

ఇంకా విడుదల తేదీ ఖరారు కాకపోయినా భారతీయుడు 2 ఫలితం చూశాక చరణ్ సినిమా గురించి చర్చలు అనుమానాల రూపంలో అభిమానుల మధ్య మొదలయ్యాయి. కమల్ ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు శంకర్ నిలువునా నీరుగార్చేయడంతో తర్వాతి మూవీస్ నుంచి ఏం ఆశించాలో అర్థం కాక అయోమయం చెందుతున్నారు.

అంచనాలు, హైప్ సంగతి కాసేపు పక్కనపెడితే గేమ్ ఛేంజర్ ఒక పెనుముప్పును తప్పించుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు కంటెంట్ లో ఉన్న భారీతనానికి, కథలో ఉన్న స్కోప్ కి రెండు భాగాలు అయితే ఎలా ఉంటుందనే చర్చ జరిగిందట.

దానికి అనుగుణంగా స్క్రిప్ట్ సిద్ధంగా లేకపోయినా ఒకవేళ ఓకే అనుకుంటే ఇండియన్ తరహాలో అప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసి పొడిగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన శంకర్ కు వచ్చినట్టు చెబుతున్నారు. అయితే అప్పటికే జరిగిన విపరీతమైన జాప్యానికి తోడు ఈ ప్యాన్ ఇండియా మూవీ వల్ల తాను మూడు సంవత్సరాలు బ్లాక్ చేసుకోవాల్సి వచ్చిందని భావించిన రామ్ చరణ్ సీక్వెల్ కు మొగ్గు చూపలేదని వినికిడి. అప్పన్న, రామ్ నందన్ ఐఏఎస్ గా డ్యూయల్ రోల్ చేసిన మెగా పవర్ స్టార్ ఈసారి నాయక్ ని మించిన డబుల్ ట్రీట్ ఇస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాకపోతే లేట్ అవుతోంది.

ఇక భారతీయుడు 2 రిజల్ట్ గేమ్ ఛేంజర్ బిజినెస్ ని తెలుగు రాష్ట్రాల్లో ప్రభావితం చేయకపోవచ్చు కానీ తమిళనాడు, కేరళలో ఎఫెక్ట్ ఇస్తుందని బయ్యర్లు డౌట్ పడుతున్నారు. ఎందుకంటే శంకర్ బ్రాండ్ ఐ నుంచే తగ్గుతూ వస్తోంది. 2.0 ఎంత వసూలు చేసినా పెట్టుబడి లెక్కలో చాలా చోట్ల లాభాలిచ్చిన వెంచర్ గా మిగల్లేదు.

ఇక ఇప్పుడు ఇండియన్ 2 ఎంత నష్టం వస్తుందో లెక్క గట్టేందుకు టైం పట్టేలా ఉంది. ఇలాంటి పరిస్థితిలో గేమ్ ఛేంజర్ కు ప్యాన్ ఇండియా క్రేజ్ రావాలంటే చరణ్ పేరే ఎక్కువగా పని చేయాలి. తమన్ సంగీతం అందిస్తున్న గేమ్ ఛేంజర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.