సీక్వెల్ మంత్రం అన్నిసార్లు పని చేయదు

ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు కొనసాగింపంటే రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఏ మాత్రం తేడా వచ్చినా చెయ్యి తెగిపడుతుంది. లేదా ఒక్కోసారి తలే పోవచ్చు. బాహుబలి, కెజిఎఫ్, కార్తికేయ చూసి ఇదో పెద్ద సక్సెస్ ఫార్ములాని భ్రమపడిన ఎందరికో కొత్త కొత్త గుణపాఠాలు వస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు టాపిక్ కేవలం భారతీయుడు 2 గురించి కాదు. గతం నుంచి వర్తమానం దాకా సౌత్ సినిమా నేర్చుకున్న పాఠాల గురించి. మూడు దశాబ్దాల క్రితం వర్మ నిర్మాతగా వచ్చిన మనీ సూపర్ హిట్ అయ్యాక దానికి కొనసాగింపు మనీ మనీ తీస్తే అంచనాలు అందుకోలేకపోయింది. ఈ ట్రెండ్ ఇక్కడి నుంచే మొదలైందని చెప్పాలి.

జగపతిబాబు క్లాసిక్ గాయంని చాలా గ్యాప్ తర్వాత గాయం 2 కంటిన్యూ చేస్తే జనం నో అనేశారు. ఇంచుమించు అదే కథతోనే లోకేష్ కనగరాజ్ లియో తీసి హిట్టు కొట్టాడు. రొమాంటిక్ క్లాసిక్ మన్మథుడుకి నెంబర్ 2 జోడించి ప్రయోగం చేస్తే నాగార్జునకు ఫ్లాప్ తో పాటు అదనంగా విమర్శలు కూడా వచ్చాయి.

గబ్బర్ సింగ్ మేజిక్ సర్దార్ గబ్బర్ సింగ్ చేయలేదు. కిక్ 2 గురించి రవితేజ అభిమానులే మాట్లాడేందుకు ఇష్టపడరు. ఇక తమిళం సంగతి చూస్తే బిల్లా 2, విశ్వరూపం 2, చంద్రముఖి 2, సామీ స్క్వేర్, మారి 2, జైహింద్ 2 ఇలా చెప్పుకుంటూ పోటీ ఈ జాబితాను అంత త్వరగా ముగించలేం. అన్నీ ఫ్లాపులే.

మనదగ్గర టిల్లు స్క్వేర్ లాంటి ప్రూవ్డ్ హిట్స్ ఉన్నాయి, లేదనడం లేదు. పుష్ప 2 ది రూల్ మీద విపరీతమైన క్రేజ్ ఉంది. సలార్ 2, కల్కి 2 డిమాండ్ మాములుగా లేదు. గూఢచారి 2 కోసం ఎదురు చూస్తున్నవాళ్ళు ఎందరో. ఇవన్నీ సమర్ధవంతమైన దర్శకులు హ్యాండిల్ చేశారు కాబట్టి ప్రేక్షకులు వాటిని రిసీవ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

అంతే తప్ప బ్రాండ్ ఇమేజ్ ఉందని కేవలం క్యాష్ చేసుకునే ఉద్దేశంతో రెండు, మూడు భాగాల సూత్రం పాటించడం దెబ్బ కొడుతోంది. బిజినెస్ చేసుకోగలుగుతున్నారు కానీ కనీసం బ్రేక్ ఈవెన్ కావడం లేదు. ఈ ట్రెండ్ ని నిలబెట్టాల్సింది టాలీవుడ్డే.