దేవరకు ఇంకో విలన్ కావలెను

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27 విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్ పూర్తయిన భాగానికి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. మళ్ళీ పాల్గొనే అవసరం లేని ఆర్టిస్టులతో ఈ తతంగం పూర్తి చేస్తున్నారు.

రెండో ఆడియో సింగల్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇంకో డెబ్భై రోజుల సమయం మాత్రమే ఉండటంతో టీమ్ నింపాదిగా లేదు. ప్యాన్ ఇండియా ప్రమోషన్లు చేసుకోవాలి కాబట్టి దానికి అనుగుణంగా కనీసం ఒక నెల ముందు తగినంత ప్లానింగ్ అవసరం. అప్పుడే ఒత్తిడి లేకుండా సాఫీగా పని జరుగుతుంది.

ఇదంతా ఓకే కానీ దేవరలో మెయిన్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది రెండు భాగాలు కాబట్టి మరొక బలమైన ప్రతినాయకుడు అవసరమట. దాని కోసం యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ని సంప్రదించే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు సమాచారం.

ఇతను ఇప్పటికే హరిహర వీరమల్లు, బాలయ్య 109లో భాగమై ఉన్నాడు. దేవర 2 కోసం అడిగారని తెలుస్తోంది. సీక్వెల్ కి సంబంధించిన కొంత భాగం కొరటాల ఇప్పటికే తీసినప్పటికి బ్యాలన్స్ చాలా ఉందట. అక్కడ బాబీ డియోల్ లాంటి ఆర్టిస్టు అవసరం ఉందని వినికిడి. ఇంకా అఫీషియల్ కాలేదు.

అంచనాల పరంగా పెద్ద బరువు మోస్తున్న దేవర అక్టోబర్ 10 నుంచి సెప్టెంబర్ 27కి షిఫ్ట్ కావడంతో అభిమానులు ఆ డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన గుర్తింపు రెట్టింపు చేసే స్థాయిలో ఇందులో విశ్వరూపం చూడొచ్చని గట్టి నమ్మకం పెట్టుకున్నారు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో తారక్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. వాటి తీరుతెన్నులు సంబంధాలు ప్రస్తుతానికి గుట్టుగానే ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న దేవరకు అనిరుద్ రవిచందర్ ఇచ్చిన మొదటి పాట ఛార్ట్ బస్టర్ అయ్యింది. రెండో సాంగ్ ఎలా ఉండబోతోందో త్వరలోనే తేలనుంది.