‘యన్.టి.ఆర్-మహానాయకుడు’ గుర్తొస్తున్నాడు

‘భారతీయుడు-2’ మొదలైనపుడు దాన్ని ఒక సినిమాగానే అనుకున్నారు. కానీ మధ్యలో అది రెండు భాగాలుగా మారింది. గతంలో బాహుబలి, యన్.టి.ఆర్, పుష్ప లాంటి చిత్రాలను కూడా ఇలాగే మధ్యలో రెండు భాగాలుగా మార్చారు. ఐతే ‘బాహుబలి’, ‘పుష్ప’ చిత్రాల విషయంలో ఆ ఐడియా బాగానే వర్కవుట్ అయింది. కానీ ‘యన్.టి.ఆర్’ సినిమా మాత్రం తేడా కొట్టింది.

‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ సినిమా రిలీజై నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినపుడు ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ సినిమా పరిస్థితి ఏంటా అని అందరూ కంగారు పడ్డారు. అప్పటికే ఆ సినిమా చిత్రీకరణ 80 శాతం దాకా పూర్తయింది. విధిలేని పరిస్థితుల్లో దాన్ని పూర్తి చేసి రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్ట్‌ను మించి రెండో భాగం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు ‘ఇండియన్-2’ రిలీజ్ టైంలో చాలామందికి ‘యన్.టి.ఆర్’ సినిమా గుర్తుకు వస్తుంటే ఆశ్చర్యం లేదు.

‘ఇండియన్-2’, ‘ఇండియన్-3’ సినిమాలను ఒకేసారి శంకర్ పూర్తి చేసేశాడు. పార్ట్-3కి సంబంధించి చిత్రీకరణ అంతా పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ చేయాల్సి ఉంది. అవన్నీ పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ‘ఇండియన్-2’కు పూర్తిగా నెగెటివ్ టాక్ వస్తోంది. రివ్యూలకు తోడు మౌత్ టాక్ కూడా ఏమాత్రం బాగా లేదు. ఈ సినిమా చూశాక జనం పార్ట్-3 కోసం ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారన్నది సందేహం. ఇండియన్-2 చివర్లో ప్రదర్శించిన ట్రైలర్ చూస్తే కొంచెం ఆసక్తికరంగానే అనిపిస్తోంది. కానీ ఫెయిల్యూర్ సినిమాకు సీక్వెల్ వర్కవుట్ కావడం చాలా కష్టం.

‘ఇండియన్-2’కు ఓపెనింగ్స్ అయినా ఉన్నాయి.. కానీ పార్ట్-3కి అది కూడా కష్టం కావచ్చు. ఈ చిత్రానికి కూడా ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ తరహా ఫెయిల్యూర్ అనివార్యం అనే ఫీలింగ్ కలుగుతోంది. మరి పార్ట్-2 ఫెయిల్యూర్ తర్వాత మూడో భాగం జనాల్ని మెప్పించి హిట్టయితే అది అద్భుతమే అనుకోవాలి.