కిరణ్ అబ్బరం ప్రొడక్షన్స్ సమర్పించు..

రాజావారు రాణి వారు, ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రాలతో కెరీర్ ఆరంభంలో మంచి పేరు సంపాదించాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. కానీ ఈ సినిమాలతో వచ్చిన క్రేజ్‌ను అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ‘సమ్మతమే’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ లాంటి చిత్రాలు పర్వాలేదనిపించినా.. మిగతావన్నీ దారుణమైన డిజాస్టర్లుగా నిలిచాయి.

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లుగా తన వద్దకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒప్పేసుకుని చకచకా సినిమాలు లాగించేసిన కిరణ్‌కు చేదు అనుభవాలు తప్పలేదు. చివరగా అతడి నుంచి వచ్చిన రూల్స్ రంజన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వరుస డిజాస్టర్లతో మార్కెట్, క్రేజ్ అంతా కరిగిపోవడంతో కిరణ్‌కు కెరీర్లో గ్యాప్ తప్పలేదు. దీంతో కొన్నాళ్లుగా తన పేరే వినిపించట్లేదు టాలీవుడ్లో.

ఐతే ఎట్టకేలకు కిరణ్ తన కొత్త చిత్రం కబురు చెప్పాడు. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా టైటిల్ అనౌన్స్‌మెంట్ అప్‌డేట్ ఇచ్చాడు. ఒకప్పుడు బాగా పాపులర్ అయిన పోస్ట్ కార్డ్ నేపథ్యంలో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. అభినయ వాసుదేవ్ అనే అమ్మాయి.. దీపాల పద్మనాభం అనే ఎస్‌ఐకి ఈ లెటర్ రాసినట్లు హింట్ ఇచ్చారు. ఈ దీపాల పద్మనాభమే హీరో కిరణ్ అన్నమాట. అతను కృష్ణగిరి పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ అని కూడా పేర్కొన్నారు. పోస్టు కార్డు కాలంలో నడిచే కథ అంటే ఇది పీరియడ్ మూవీ అని అర్థం.

విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ అనే బేనర్‌తో కలిసి కిరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ‘కేఏ ప్రొడక్షన్స్’ అంటూ తన బేనర్ పేరు కూడా పోస్టర్ మీద కనిపించింది. ఈ 9న ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించబోతున్నారు. పోస్టర్ మీద దర్శకుడి పేరు వేయలేదు. పూర్తి వివరాల కోసం ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.