రవితేజతో కాదు.. విశ్వక్‌తో

‘జాతిరత్నాలు’ సినిమాతో యువ దర్శకుడు అనుదీప్ కేవీ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. అంతకుముందే అతను ‘పిట్టగోడ’ అనే సినిమా తీసిన సంగతే జనాలకు తెలియదు. కానీ ఈ సినిమా మాత్రం సెన్సేషనల్ హిట్టయి అనుదీప్‌కు ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చింది. ఐతే దీని తర్వాత అనుదీప్ తీసిన ‘ప్రిన్స్’ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ‘జాతిరత్నాలు’ తరహా కామెడీనే ట్రై చేసినా ఎందుకో వర్కవుట్ కాలేదు.

ఆ సినిమా తేడా కొట్టడంతో తర్వాతి సినిమాను లైన్లో పెట్టడంలో అనుదీప్ ఇబ్బంది పడుతున్నాడు. రకరకాల కాంబినేషన్లు అనుకుంటున్నా అవేవీ వర్కవుట్ కావడం లేదు. చివరగా మాస్ రాజా రవితేజతో అనుదీప్ సినిమా అని గట్టిగా ప్రచారం జరిగింది. ఇక సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అనుకున్నారు. కానీ అది కూడా కార్యరూపం దాల్చనట్లే కనిపిస్తోంది.

అనుదీప్‌తో సినిమా ప్రచారంలోకి వచ్చాక రవితేజ.. ‘ఈగల్’ సినిమా చేశాడు. అది రిలీజవ్వడమే కాక ‘మిస్టర్ బచ్చన్’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. కానీ అనుదీప్ సినిమా గురించి అతీ గతీ లేదు. తాజా సమాచారం ప్రకారం అనుదీప్.. రవితేజ సంగతి వదిలేసి వేరే హీరోను ఎంచుకున్నాడట. ఇటీవలే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో పలకరించిన విశ్వక్సేన్‌తో అనుదీప్ తర్వాతి సినిమా ఓకే అయినట్లు తెలుస్తోంది.

14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోందట. విశ్వక్ ఈ మధ్య వరుసగా సీరియస్ సినిమాలే చేస్తున్నాడు. ఈసారి రూటు మార్చి అనుదీప్‌తో కామెడీ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరి కలయికలో సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొనడం ఖాయం. మరి అనుదీప్ ‘జాతిరత్నాలు’ మ్యాజిక్‌ను ఈ సినిమాతో రిపీట్ చేస్తాడేమో చూడాలి.