అంతులేని కథగా అభిమాని హత్య

కర్ణాటకనే కాదు పక్క రాష్ట్రాల సినీ ప్రేమికులను షాక్ కి గురి చేసిన స్టార్ హీరో దర్శన్ ఉదంతం ఇంకా మలుపులు తిరుగుతూనే ఉంది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఇతనికి దాన్ని జూలై 18 దాకా పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

చిత్రదుర్గకు చెందిన అభిమాని రేణుకస్వామిని బెంగళూరు తీసుకొచ్చి దారుణంగా హత్య చేసిన కేసులో ఏ1గా ఉన్న దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు ఇరవైకి పైగా నిందితులు విచారణను ఎదురుకుంటున్నారు. దర్శన్ ఫ్యాన్స్ కొందరు తమ హీరోకు మద్దతుగా జైల్లో ఖైదీ డ్రెస్ మీద నెంబర్ ని బండ్లకు, కార్ల నెంబర్ ప్లేట్లకు స్టిక్కరింగ్ చేయించుకోవడం కలకలం రేపుతోంది.

ఇదిలా ఉండగా దర్శన్ భార్య విజయలక్ష్మి తాజాగా బెంగళూరు పోలీస్ కమీషనర్ దయానందకు ఓ లేఖ రాసింది. దర్శన్, పవిత్ర కేవలం స్నేహితులు మాత్రమేనని, ఆమెను సతీమణిగా పేర్కొంటూ హోమ్ మినిస్టర్ తో పాటు పలు మీడియా సంస్థలు చెప్పడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా చేయడం వల్ల తనకు తన బిడ్డకు భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని భయం వెలిబుచ్చింది.

పవిత్రకు సంజయ్ సింగ్ అనే వ్యక్తితో పెళ్లయి వాళ్ళకో కూతురు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. రికార్డుల్లో ఈ విషయాలను స్పష్టంగా రాసుకోవాలని ఆమె అభ్యర్థించడం గమనించాల్సి విషయం.

ఎక్కడా తన భర్త మంచివాడని, న్యాయం గెలుస్తుందని విజయలక్ష్మి పేర్కొనలేదు. ఈ కేసులో పోలీసులకు కీలకమైన ఆధారాలు చాలా దొరికాయి. దర్శన్ కి బెయిల్ ఇస్తే అవి తారుమారు అయ్యే ప్రమాదముందని గుర్తించి న్యాయస్థానం మంజూరు చేయకుండా కస్టడీకి ఇస్తోంది.

ఇంకా విచారణకు ఎంత కాలం పడుతుంది, ట్రయిల్ నుంచి శిక్ష దాకా వెళ్ళేలోపు ఎన్ని నెలలు, సంవత్సరాలు కరిగిపోతాయోననే ఆందోళన జనంలో కనిపిస్తోంది. అయితే దర్శన్ బయటికి రావడం మాత్రం అంత సులభంగా లేదు. చూస్తుంటే ఇదో అంతులేని కథగా మారేలా ఉంది. క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందో.