భారతీయుడు-2లో ఏంటో ఆ అద్భుతం?

ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూసే విజువల్ మాయాజాలం ఇప్పుడు మన చిత్రాల్లోనూ కనిపిస్తోంది. రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ చూసి హాలీవుడ్ వాళ్లే ఆశ్చర్యపోయిన పరిస్థితి. తాజాగా విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో విజువల్స్ చూస్తే హాలీవుడ్‌కు మనమేం తక్కువ అనే భావన కలగడం ఖాయం. భారీ కలలు కంటున్న మన డైరెక్టర్లు.. మన టెక్నీషియన్ల సాయంతోనే పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించుకుని వెండి తెర మీద అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు.

ఐతే ఇప్పటిదాకా మన దర్శకులు ఏం చేసినా హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొందినట్లే అనిపించేది. కానీ త్వరలో విడుదల కాబోతున్న ‘ఇండియన్-2’ చిత్రంలో ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఏ చిత్రంలోనూ చూడనిది ఏదో చూపించబోతున్నారట. దాని గురించి ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రోబో, బాహుబలి లాంటి భారీ చిత్రాలకు వీఎఫెక్స్ సూపర్ వైజర్‌గా పని చేసిన శ్రీనివాస్ మోహన్.. ‘భారతీయుడు-2’కు కూడా ఇవే బాధ్యతలు నిర్వర్తించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ఒక దశ వరకు ‘ఇండియన్-2’ మామూలుగానే సాగిపోయింది. కానీ ఒక రోజు శంకర్ గారు కాల్ చేసి ఒక ఆలోచన చెప్పారు. అది చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. నిజానికి అలాంటిది ఇప్పటిదాకా హాలీవుడ్లో కూడా ఎవ్వరూ చేయలేదు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటిది ట్రై చేయలేదు. ఐతే మనం ఎప్పుడూ హాలీవుడ్ కంటే ఐదు పదేళ్లు ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చాక అందరూ సమానం అయిపోయారు. ఆ టెక్నాలజీ అందరికీ కొత్తే. మన దగ్గర ఏఐని హాలీవుడ్ వాళ్ల కంటే బాగా ఉపయోగిస్తున్న నిపుణులు ఉన్నారు. వారి సాయంతోనే ‘ఇండియన్-2’లో ఒక సీక్వెన్స్ చేశాం. అలాంటిది ప్రపంచ సినిమాలో ఇప్పటిదాకా రాలేదని కచ్చితంగా చెప్పగలను” అన్నాడు. ఆయన ఈ స్థాయిలో చెబుతున్న సీక్వెన్స్ ఏంటన్నది ఆసక్తికరం.