సౌత్ పాఠాలు నేర్చుకుంటున్న బాలీవుడ్

ఒక స్టార్ స్టామినా అందులోనూ కమర్షియల్ గా పెద్ద మార్కెట్ ఉన్న హీరోని తెరమీద ఎలా చూపించాలి, ఎలా ఎలివేట్ చేయాలనే దాని మీద మన సౌత్ దర్శకులు బాలీవుడ్ కు పాఠాలు నేర్పించే స్థాయికి ఎదిగారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కళ్ళ ముందు కనిపిస్తున్న ఉదాహరణలే దానికి సాక్ష్యం. గత ఏడాది నార్త్ లో ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన యానిమల్ తీసిన సందీప్ రెడ్డి వంగా మనవాడేనని గర్వంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు అతని మేకింగ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన క్రిటిక్స్ ఇప్పుడు బాహుబలి రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించడం ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం.

షారుఖ్ ఖాన్ కి జవాన్ రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన అట్లీ తమిళవాడు. ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ నుంచి పిలుపు వస్తే ఆయనతో పాటు రజనీకాంత్ ని కలిపి మల్టీస్టారర్ తీసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక కల్కి 2898 ఏడి దర్శకుడు నాగ్ అశ్విన్ పేరు మొన్నటిదాకా ముంబై జనాలకు తెలియదు. కానీ నాలుగు రోజులుగా ఆ ప్యాన్ ఇండియా మూవీ సృష్టిస్తున్న ప్రభంజనం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యం తీశాడని తెలుసుకుని వాటిని ఓటిటిలో చూస్తున్నారు. అంతకు ముందు పుష్ప డబ్బింగ్ వెర్షనే అయినా సుకుమార్ దెబ్బకు రికార్డులు ఎగిరిపోయాయి.

బాహుబలితో వీటికి పునాది వేసింది రాజమౌళినే. ఆర్ఆర్ఆర్ తో పతాక స్థాయికి తీసుకెళ్లాడు. ఆస్కార్ గెలిచాక టాలీవుడ్ అనే బ్రాండ్ మీద దేశమంతా ఎనలేని గౌరవం కనిపిస్తోంది. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు సత్య, రంగీలాతో అక్కడ బలమైన ముద్ర వేసినప్పటికే మార్కెట్ పరిధి ఖాన్లని మించి పోలేదు. పైగా ఆయన తీసినవి స్ట్రెయిట్ సినిమాలు. కానీ ఇప్పుడు మనోళ్లు డబ్బింగులతోనూ సంచలనాలు సృష్టిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, రన్బీర్ కపూర్, షారుఖ్ ఖాన్ లను ఎలా చూపిస్తే మాస్ పిచ్చెక్కిపోతారో పాఠాలు నేర్పిస్తున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటే కాదనేదెవరు.