వెంకీ మామ దారిలో సందీప్ కిషన్

ఈ మధ్య కొంచెం స్పీడ్ తగ్గినట్టు అనిపించినా వెబ్ సిరీస్ లకు ఆదరణ మరీ కిందిస్థాయికి వెళ్ళలేదు. సరైన కంటెంట్ వస్తే జనం ఎన్ని నెలలైనా ఎదురు చూస్తారని మిర్జాపూర్, స్కామ్ 1992 లాంటి బ్లాక్ బస్టర్లు నిరూపించాయి. బూతుల మీద విమర్శలను పక్కనపెడితే రానా నాయుడుకి సైతం బ్రహ్మాండమైన ఆదరణ దక్కింది. అందుకే రెండో సీజన్ చకచకా షూటింగ్ చేస్తున్నారు. సీనియర్ స్టార్ హీరోల్లో డిజిటల్ స్పేస్ లో అడుగు పెట్టిన మొదటి హీరోగా వెంకటేష్ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. హిందీలో మాములే కానీ టాలీవుడ్ లో ఇలాంటి ట్రెండ్ మొదలుపెట్టింది మాత్రం వెంకీనే.

ఇప్పుడీ దారిలో సందీప్ కిషన్ వెళ్తున్నాడు. నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న తెలుగు వెబ్ సిరీస్ లో తనే హీరో. డీజే టిల్లు ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఇది రూపొందనుందని సమాచారం. సందీప్ గతంలో ఫ్యామిలీ మ్యాన్ లో క్యామియో చేశాడు కానీ పూర్తి నిడివి గల పాత్ర మాత్రం పోషించలేదు. ఇప్పుడు మంచి కథ, కోట్ల రూపాయల ఖర్చుతో నెట్ ఫ్లిక్స్ తెరకెక్కించనుండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. జానర్ ఏదనేది బయటికి రాలేదు కానీ సస్పెన్స్, క్రైమ్ ఆధారంగానే ఉంటుందని ఇన్ సైడ్ టాక్. సహజంగానే ఈ ఓటిటిలో బోల్డ్ నెస్ ఎక్కువ కాబట్టి ఎంత మోతాదనేది రిలీజయ్యాకే తెలుస్తుంది.

సౌత్ మార్కెట్ మీద గట్టి కన్ను వేసిన నెట్ ఫ్లిక్స్ భారీ సినిమాల హక్కులను వందల కోట్లు ఖర్చు పెట్టి కొనడం ద్వారా అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లాంటి వాటికి గట్టి పోటీ ఇస్తోంది. ఒకప్పుడు ఇంటర్నేషనల్ కంటెంట్ ఉంటే చాలనుకునే ధోరణి వీడి గో లోకల్ విన్ గ్లోబల్ సూత్రంతో టాలీవుడ్ నిర్మాణ సంస్థలతో భారీ డీల్స్ కుదుర్చుకుంటోంది. అందులో భాగంగానే సందీప్ కిషన్ ప్రాజెక్టు సెట్ అయ్యింది. గతంలో నెట్ ఫ్లిక్స్ తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్ లాంటి దర్శకులతో పిట్ట కథలు అనే యాంథాలజీ చేసింది కానీ వర్కౌట్ కాలేదు. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పక్కా ప్లానింగ్ తో తీస్తున్నారట.